AP Board Class 10 Telugu Chapter 4 వెన్నెల Textbook Solutions PDF: Download Andhra Pradesh Board STD 10th Telugu Chapter 4 వెన్నెల Book Answers |
Andhra Pradesh Board Class 10th Telugu Chapter 4 వెన్నెల Textbooks Solutions PDF
Andhra Pradesh State Board STD 10th Telugu Chapter 4 వెన్నెల Books Solutions with Answers are prepared and published by the Andhra Pradesh Board Publishers. It is an autonomous organization to advise and assist qualitative improvements in school education. If you are in search of AP Board Class 10th Telugu Chapter 4 వెన్నెల Books Answers Solutions, then you are in the right place. Here is a complete hub of Andhra Pradesh State Board Class 10th Telugu Chapter 4 వెన్నెల solutions that are available here for free PDF downloads to help students for their adequate preparation. You can find all the subjects of Andhra Pradesh Board STD 10th Telugu Chapter 4 వెన్నెల Textbooks. These Andhra Pradesh State Board Class 10th Telugu Chapter 4 వెన్నెల Textbooks Solutions English PDF will be helpful for effective education, and a maximum number of questions in exams are chosen from Andhra Pradesh Board.Andhra Pradesh State Board Class 10th Telugu Chapter 4 వెన్నెల Books Solutions
Board | AP Board |
Materials | Textbook Solutions/Guide |
Format | DOC/PDF |
Class | 10th |
Subject | Maths |
Chapters | Telugu Chapter 4 వెన్నెల |
Provider | Hsslive |
How to download Andhra Pradesh Board Class 10th Telugu Chapter 4 వెన్నెల Textbook Solutions Answers PDF Online?
- Visit our website - Hsslive
- Click on the Andhra Pradesh Board Class 10th Telugu Chapter 4 వెన్నెల Answers.
- Look for your Andhra Pradesh Board STD 10th Telugu Chapter 4 వెన్నెల Textbooks PDF.
- Now download or read the Andhra Pradesh Board Class 10th Telugu Chapter 4 వెన్నెల Textbook Solutions for PDF Free.
AP Board Class 10th Telugu Chapter 4 వెన్నెల Textbooks Solutions with Answer PDF Download
Find below the list of all AP Board Class 10th Telugu Chapter 4 వెన్నెల Textbook Solutions for PDF’s for you to download and prepare for the upcoming exams:10th Class Telugu 4th Lesson వెన్నెల Textbook Questions and Answers
ఉన్ముఖీకరణ : చదవండి – ఆలోచించి చెప్పండి
ఈ కవిత చదవండి.
కొండకోనల్లో
నవ్వుతూ, తుళ్ళుతూ పరుగెడుతున్న
సెలయేరు
కాలుజారి లోయలో పడిపోయింది.
అది చూసి
ఆకులు చాటుచేసుకొని,
మొగ్గలు బుగ్గలు నొక్కుకున్నాయి.
ఇదంతా చూస్తున్న సూరీడు
పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూ
పడమటి కొండల వెనక్కి
పడిపోయాడు.
ప్రశ్నలు – జవాబులు
ప్రశ్న 1.
ఈ కవిత దేన్ని వర్ణిస్తున్నది?
జవాబు:
సూర్యాస్తమయాన్ని వర్ణిస్తున్నది. సూర్యాస్తమయంతో బాటు సెలయేరును, పూలమొగ్గలను కూడా వర్ణిస్తున్నది.
ప్రశ్న 2.
సూరీడు పడమటి కొండల వెనక్కి పడిపోవడమంటే ఏమిటి?
జవాబు:
సూరీడు పడమటి కొండల వెనక్కి పడిపోవడమంటే సూర్యాస్తమయం జరిగిందని సూచన.
ప్రశ్న 3.
సెలయేరు కొండకోనల మీద నవ్వుతూ, తుళ్ళుతూ పరుగెత్తడం అంటే మీకేమని అర్థమయ్యింది?
జవాబు:
ప్రాణులకు జవసత్వాలను, ప్రకృతికి అందాలను, ఉత్సాహాన్ని ఇచ్చేవాడు సూర్యుడు. సూర్యకాంతి సమస్త జీవులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆహారాన్ని అందిస్తుంది. ఆహారంతో కడుపు నిండితే ఆనందం కలుగుతుంది. ఆనందం వలన తుళ్ళుతూ, నవ్వుతూ ఉంటాం. దీనికి సంకేతంగానే సెలయేరు కొండకోనల మీద నవ్వుతూ, తుళ్ళుతూ పరుగెత్తడం వర్ణించబడింది. అందుకే సూర్యాస్తమయ వర్ణనలో సెలయేరు కాలుజారి లోయలో పడిపోయిందని వర్ణించారు.
ప్రశ్న 4.
వర్ణనాత్మకమైన కవిత్వం చదవడం వల్ల కలిగే ప్రయోజనాలేవి?
జవాబు:
వర్ణనాత్మకమైన కవిత్వం చదవడం వలన మనోవికాసం కలుగుతుంది. ఒక విషయానికి అనేక విషయాలతో కల అనుబంధం తెలుస్తుంది. ఈ కవితలో సూర్యాస్తమయ వర్ణనలో భాగంగా సెలయేరును, మొగ్గలను చాలా చక్కగా వర్ణించారు.
సూచన :
ఇదే విధంగా ఉపాధ్యాయుడు అనేక ప్రశ్నలు వేస్తూ, వారిచేత ఎక్కువగా మాట్లాడిస్తూ సమాధానాలు రాబట్టాలి.
అవి చేయండి
I. అవగాహన – ప్రతిస్పందన
ప్రశ్న 1.
పాఠంలో వెన్నెలను వర్ణించడం గమనించారు కదా ! ప్రకృతిలోని వివిధ సందర్భాలను వర్ణించడం వల్ల మీకు కలిగే అనుభూతులను తరగతిలో చరించండి.
జవాబు:
తెలతెలవారుతుంటే రకరకాల పక్షుల కిలకిలారావాలు వింటుంటే చాలా ఆనందంగా ఉంటుంది. చల్లటి పైరగాలి శరీరానికి తగులుతుంటే ఆ హాయి గిలిగింతలు గొలుపుతుంది. చేలు, తోటలతో పచ్చగా ఉన్న పరిసరాలు చూస్తుంటే పరవశం కలుగుతుంది. పిల్ల కాలువలు, సెలయేళ్లు, నదులు, సముద్ర తీరాలలో ప్రొద్దుటే తిరగాలి. ఆ అందం వర్ణించలేము. హిమాలయ పర్వతాలను ఎంతోమంది మహాకవుల నుండి సామాన్యుల వరకు తనివితీరా దర్శించారు. వర్ణించారు.
సూర్యుడు పడమటికి వాలుతుంటే, అది ఒక అద్భుతమైన సుందర దృశ్యం. సూర్యాస్తమయాన్ని సముద్రతీరంలో చూస్తే చాలా బాగుంటుంది. ఎంతోమంది చిత్రకారుల కుంచెలకు పని కల్పిస్తున్న అద్భుత సన్నివేశాలెన్నో ప్రకృతిలో ఉన్నాయి.
ప్రశ్న 2.
మీకు నచ్చిన ఒక సందర్భాన్ని వర్ణించండి.
జవాబు:
మాది కోనసీమలోని ఒక చిన్న గ్రామం. ఎటుచూసినా కొబ్బరి తోటలే. ఆ పచ్చని కొబ్బరాకులను చూస్తే భూమాత తన సౌభాగ్యానికి గర్వించి, స్వర్గానికి సవాలుగా ఎగరేసిన జెండాలలా కనిపిస్తాయి. సరిహద్దుల రక్షణకు, భారతదేశ బలపరాక్రమాలకు ప్రతీకలుగా నిలబడిన మన భారత సైన్యంలా కనిపిస్తాయి కొబ్బరిచెట్ల వరుసలు. ఉట్టిమీద దాచిన పాలు, పెరుగు, మిఠాయిలలా కనిపిస్తాయి కొబ్బరికాయలు.
( సూచన : ఇదే విధంగా ప్రతి విద్యార్థి తన సొంతమాటలలో నచ్చింది వర్ణించాలి.
ప్రశ్న 3.
ఎఱ్ఱన రాసిన కింది పద్యం చదవండి.
సీ|| కలఁడు మేదిని యందుఁ గలఁ డుదకంబులఁ
గలఁడు వాయువునందుఁ గలఁడు వహ్నిఁ
గలఁడు భానుని యందుఁ గలఁడు సోముని యందుఁ
గలఁ డంబరంబునఁ గలఁడు దిశలఁ
గలఁడు చరంబులఁ గలఁ డచరంబులఁ
గలఁడు బాహ్యంబున గలఁడు లోన
గలఁడు సారంబులఁ గలఁడు కాలంబులఁ
గలఁడు ధర్మంబులఁ గలడు క్రియలఁ
తే॥నీ॥ గలఁడు కలవాని యందును, గలఁడు లేని
వాని యందును, గలఁడెల్లవాని యందు
నింక వేయును నేల సర్వేశ్వరుండు .
కలఁడు నీయందు నాయందుఁ గలఁడు కలఁడు
(నృసింహపురాణం-పంచమాశ్వాసం-78)
అ) పై పద్యంలో చాలా సార్లు పునరుక్తమైన పదమేది?
జవాబు:
పై పద్యంలో ‘కలడు’ అనే పదం 22 సార్లు కలదు.
ఆ) పునరుక్తమైన పదం పలుకుతున్నప్పుడు, వింటున్నప్పుడు మీకు కల్గిన అనుభూతిని చెప్పండి.
జవాబు:
‘కలడు’ అనే పద్యాన్ని ప్రతి పాదంలోను సుమారుగా 4 సార్లు ప్రయోగించారు. ఈ పద్యం ‘కలడు’ తో ప్రారంభమై’ ‘కలడు’ తోనే ముగిసింది. ‘కలడు’ అని అనేకసార్లు చెప్పారు అంటే తప్పనిసరిగా అది దైవం గురించే. దేవుడు ‘కలడు’ అని చెప్పాలంటే ప్రతి వస్తువును పరిశీలించి దైవతత్వాన్ని తెలుసుకొన్నవారికి మాత్రమే సాధ్యం. సృష్టిలోని ప్రతి వస్తువులోను పరమాత్మను సరిదర్శించాలి అని ఈ పద్యం చెబుతోంది. నాకైతే ఈ పద్యం వింటున్నప్పుడు దైవాన్ని సందర్శించినంత ఆనందం (బ్రహ్మానందం) కలిగింది.
ఇ) గీత గీసిన మాటల అర్థాలు తెలుసుకోండి.
జవాబు:
మేదిని = భూమి
ఉదకంబు = నీరు
వాయువు = గాలి
వహ్ని = అగ్ని
భానుడు = సూర్యుడు
సోముడు = చంద్రుడు
అంబరము = ఆకాశం
దిశలు = దిక్కులు
చరంబులు = కదిలేవి (జంతువులు, పక్షులు మొ||నవి.)
అచరంబులు = కదలనివి (పర్వతాలు, చెట్లు మొ||నవి.)
బాహ్యంబు = పై భాగము (కంటికి కనబడే భౌతిక వస్తువులు)
లోన = కంటికి కనబడనివి (ఆత్మ, మనస్సు, ప్రాణం మొ||నవి)
సారంబులు = సారవంతమైనవి
కాలంబులు = భూతభవిష్యద్వర్తమానాది సమయములు
ధర్మంబులు = నిర్దేశించబడిన స్వభావాలు
క్రియలు = పనులు
కలవాడు = ధనవంతుడు
లేనివాడు = పేదవాడు
నీయందు = ఎదుటి వానియందు
నాయందు = కర్తయందు
ఇప్పుడు పోతన రాసిన కింది పద్యం చదవండి.
మ|| | కలఁడంబోధిఁ గలండు గాలిఁ గలఁ డాకాశంబునన్ కుంభినిన్ గలఁ డగ్నిన్ దిశలం బగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలన్ గలఁ డోంకారమునం ద్రిమూర్తులఁ ద్రిలింగవ్యక్తులం దంతటన్ గలఁ డీశుండు గలండు తండ్రి ! వెదకంగా నేల నీయాయెడన్. |
(శ్రీమదాంధ్ర మహాభాగవతం-సప్తమస్కంధం-78)
అ. ఎఱ్ఱన పద్యంలో మీరు గుర్తించిన పదాలకు ఈ పద్యంలో ఉన్న సమానార్థకాలేవి?
జవాబు:
ఎఱ్ఱన – పోతన
మేదిని – కుంభిని
ఉదకంబు – అంభోధి
వాయువు – గాలి
వహ్ని = అగ్ని
భానుడు – ఖద్యోతుడు
సోముడు – చంద్రుడు
అంబరము – ఆకాశం
దిశలు – దిశలు
బాహ్యంబు – త్రిమూర్తులు, త్రిలింగ వ్యక్తులు
ఎల్లవానియందు – అంతటన్
సర్వేశ్వరుడు – ఈశుండు
కాలంబులు – పగళ్ళు, నిశలు
వేయునునేల – ఈయాయెడన్
ఆ) రెండు పద్యాలను పోల్చి చూడండి.
జవాబు:
ఎఱ్ఱన ‘సీస పద్యం’లో రచించిన భావాన్ని పోతన ‘శార్దూలం’లో రచించాడు. ఎఱ్ఱన ప్రస్తావించిన వాటిని చాలా వరకు (13 పదాలు) పోతన ప్రస్తావించాడు. ఇద్దరు కవులూ ‘కలడు’ అనే పదంతోటే పద్యం ప్రారంభించారు. ‘కలడు’ అనేది ఎఱ్ఱన 22 సార్లు ప్రయోగించాడు. పోతన 9 సార్లే ప్రయోగించాడు. ఎఱ్ఱన చెప్పిన ధర్మాలు, క్రియలు, చరాచరాలు, ధనిక – పేద వంటివి పోతన వదిలేసి, అన్నిటికీ సరిపడు ఒకే పదం ‘ఓంకారం’ ప్రయోగించాడు. దైవం ఉండేది ఓంకారంలోనే. అందుకే దానిని ప్రస్తావించి పోతన తన భక్తిని చాటుకొన్నాడు.
4. పువ్వు గుర్తుగల పద్యాలను భావస్ఫోరకంగా చదవండి. .
జవాబు:
చ|| సురుచిరతారకాకుసుమశోభి నభోంగణభూమిఁ గాలమ న్గరువపు సూత్రధారి జతనంబున దిక్పతికోటి ముందటన్ సరసముగా నటింపఁగ నిశాసతి కిత్తిన క్రొత్తతోఁపుఁబెం దెర యన నొప్పి సాంధ్యనవదీధితి పశ్చిమదికటంబునన్. |
చ| దెసలను కొమ్మ లొయ్య నతిబీర్ఘములైన తరంబులన్ బ్రియం బెసఁగఁగ నూఁది నిక్కి రజనీశ్వరుఁ డున్నతలీలఁ బేర్చు నా కస మను వీరి భూరుహము కాంతనిరంతర కారణా లస త్కుసుమ చయంబు గోయుట యనఁ బ్రాణి సముత్సుకాకృతిన్. |
చ|| వడిగొని చేతులుప్పతిల వాలిన కేసరముల్ దలిర్పఁ బు ప్సోడి దలమెక్కి తేనియలు పొంగి తరంగలుఁగాఁ జలంగి పైఁ బడు నెలడింటిదాఁటులకుఁ బండువులై నమసారభంబు లు గడువుగ నుల్లసిల్లె ఘనకైరవషండము నిండు వెన్నెలన్. |
5. రెండో పద్యానికి ప్రతిపదార్థం ఈ కింద ఉన్నది. ఇదే విధంగా 5, 7 సంఖ్యగల పద్యాలకు ప్రతిపదార్థాలు రాయండి.
2వ పద్యం (సురుచిరతార …… పశ్చిమదిక్తటంబునన్.)
జవాబు:
ప్రతిపదార్ధం :
సురుచిర = చాలా అందమైన
తారకా = చుక్కల
కుసుమ = పూల (చే)
శోభి = మనోజ్ఞమైనదైన
నభః = ఆకాశమనే
అంగణభూమిన్ = రంగస్థలం (వేదిక) పై
కాలము + అన్ = కాలం అనే
గరువపు = గొప్ప
సూత్రధారి = సూత్రధారి (దర్శకుడు)
జతనంబున = ప్రయత్నపూర్వకంగా
దిక్పతికోటి = దిక్పాలకుల సమూహం
ముందటన్ = ముందు (ఎదుట)
సరసముగా = చక్కగా (యుక్తంగా)
నటింపగ = నాట్యం చేయడానికి సిద్ధపడిన
నిశాసతికిన్ = రాత్రి అనే స్త్రీకి
ఎత్తిన = నిలిపిన (పట్టిన)
క్రొత్త = కొత్తదైన
తోఁపున్ = ఎర్రని
పెన్ + తెర = పెద్ద తెర
అనన్ = అన్నట్లుగా
పశ్చిమ దిక్ + తటంబునన్ = పడమటి తీరంలోని (పడమటి దిక్కున)
సాంధ్య = సంధ్య సంబంధించిన (సంధ్యాకాలపు)
నవ దీధితి = కొత్త వెలుగు
ఒప్పెన్ = ప్రకాశించింది
5వ పద్యం (దెసలను ………… సముత్సుకాకృతిన్.)
జవాబు:
ప్రతిపదార్థం :
ఆకసమను = ఆకాశమనెడు
పేరి = పేరుగల
భూరుహము = చెట్టున
దెసలను = దిక్కులనెడు
కొమ్మలు = కొమ్మలలో గల
తారకా = నక్షత్రాలనెడు
లసత్ = ప్రకాశించు
కుసుమచయంబున్ = పూల సమూహమును
కోయుటకు = త్రుంచుటకు
ఒకోయనన్ = కదా ! అనునట్లు
ఒయ్యన్ = వెంటనే
రజని + ఈశ్వరుడు = రాత్రికి ప్రభువైన చంద్రుడు
ప్రియంబు = ఇష్టము
ఎసగన్ = ఎక్కువ కాగా
ఊది = నిశ్శ్వాసించి(గాలిని ఊది)
నిక్కి = నిలబడి
నిరంతర = ఎల్లపుడు
కాంత = కాంతులతో
అతిదీర్ఘములైన = మిక్కిలి పొడవైన
కరంబులన్ = చేతులతో (కిరణములతో)
సముత్సుకాకృతిన్ = మిక్కిలి ఉత్సాహమే రూపు దాల్చినట్లు
ప్రాకెన్ = ప్రాకెను
7వ పద్యం (వడిగొని తేకు ………… వెన్నెలన్.)
జవాబు:
ప్రతిపదార్థం :
నిండు వెన్నెలన్ = పండు వెన్నెలలో
ఘన = గొప్పవైన
కైరవ షండము = కలువల సమూహం
వడిన్ = వేగంతో
కొని = పూని
ఱేకులు = పూల ఱేకులు
ఉప్పతిల = అతిశయించగా
వాలిన = కిందికి దిగిన (వాడిపోయిన)
కేసరముల్ = దిద్దులు
తలిర్పన్ = అతిశయించునట్లుగా
పుప్పొడి = పుప్పొడి యొక్క
తలము = పై భాగమును
ఎక్కి = అధిరోహించి
తేనియలు = మధువులు
పొంగి = ఉప్పొంగి
తరంగలుగాన్ = ప్రవాహాలుగా
చెలంగి = విజృంభించి
పైన్ = పైన
పడు = పడుచున్న
నెల = చంద్రుడు అనెడు
తేటి =తుమ్మెద
దాటులకున్ = కలయికలకు
పండువులై = (కనుల) పండువలవుతూ
ఉగ్గడువుగ = ఎక్కువగా
నవ సౌరభంబులు = క్రొత్త సువాసనలు
ఉల్లసిల్లె = ప్రకాశించెను.
II. వ్యక్తీకరణ-సృజనాత్మకత
1. క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.
అ) “కాటుక గ్రుక్కినట్టి కరవటంబన జగదండఖండ మమరె” ఈ మాటలు కవి ఏ సందర్భంలో పేర్కొన్నాడో వివరించండి.
జవాబు:
ఈ మాటలు ఎఱ్ఱన రచించిన నృసింహపురాణం తృతీయాశ్వాసం నుండి గ్రహించబడిన ‘వెన్నెల’ అను పాఠంలోనిది. దిక్కులు, ఆకాశం, భూమిని చీకటి ఆక్రమించిన విధానాన్ని వివరిస్తున్న సందర్భంలో కవి ప్రయోగించిన మాటలివి. ఈ లోకమనెడు బ్రహ్మాండ భాగము కాటుక భరిణెలాగా ఉందని భావం.
ఆ) ఈ పాఠంలో కవి వెన్నెలను వర్ణించడానికి ఏయే అంశాల నెన్నుకున్నాడో తెల్పండి.
జవాబు:
సూర్యాస్తమయాన్ని, పద్మాలు ముడుచుకొనడాన్ని కవి వర్ణించాడు. సాయంసంధ్యలో పడమటి వెలుగును వర్ణించాడు. చంద్రోదయాన్ని కూడా రమణీయంగా వర్ణించాడు. 3 పద్యాలలో, వెన్నెల వర్ణించడానికి ముందు అంశాలను వర్ణించాడు. తర్వాతి పద్యంలో చంద్రకాంతి వ్యాప్తిని వర్ణించాడు. ‘వెన్నెల’ దృశ్యం వర్ణించడానికి బలమైన పూర్వరంగం కళ్లకు కట్టినట్లు వర్ణించి వర్ణనకు మంచి పునాది వేశాడు. ప్రబంధములకు కావలసిన వర్ణనా నైపుణ్యమిదే. అందుకే ఎఱ్ఱనకు ‘ప్రబంధపరమేశ్వరుడు’ అనెడి బిరుదు కలిగింది. తర్వాతి కవులందరూ ఎఱ్ఱనలోని ఈ వర్ణనా క్రమ నైపుణ్యాన్ని అనుకరించారు.
2. క్రింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.
అ) పద్య భావాలను ఆధారంగా చేసుకొని పాఠ్యభాగ సారాంశాన్ని ఇరవై వాక్యాలకు కుదించి రాయండి.
(లేదా)
తుమేదల బృందానికి పండుగ చేసిన వెన్నెల ఎలా విజృంభించిందో రాయండి.
మనోహరంగా, ధీరగంభీరంగా వెన్నెల ఎలా విస్తరించిందో రాయండి.
ఆబాల గోపాలానికి ఆత్మీయ బంధువైన చందమామ వెలుగైన వెన్నెల ఎలా విజృంభించిందో పాఠ్యభాగం ఆధారంగా వర్ణించండి.
జవాబు:
సూర్యాస్తమయమయ్యింది, పద్మం ముడుచుకొంది. పడమట సంధ్యారాగ కాంతి కనబడింది. చీకటి బాగా పెరిగి దిక్కులూ, భూమ్యాకాశాలూ కలిసిపోయి కాటుక నింపిన బరిణెలా విశ్వం కనిపించింది.
చంద్రోదయం :
చంద్రుడు ఉదయించాడు. వెన్నెల ప్రవాహం పాలసముద్రంలా పొంగి ఆకాశాన్ని ముంచెత్తింది. చంద్రబింబం ఆ పాలసముద్రంలో గుండ్రంగా చుట్టుకొన్న ఆదిశేషుడి శయ్యలా, చంద్రుడిలోని మచ్చ ఆ శయ్య మధ్యన ఉన్న విష్ణువులా కనబడింది.
ఆ వెన్నెలలో కలువల రేకులు విచ్చుకున్నాయి. కలువ పూలలో తేనెలు పొంగి కెరటాలుగా విజృంభించాయి. తుమ్మెదలకు విందు చేస్తూ పూల పరిమళాలు బయలుదేరాయి.
చంద్రకాంత శిలల వానలతో, చకోరాల రెక్కల స్పర్శలతో, స్త్రీల చిరునవ్వుల కాంతులతో అతిశయించి, దిక్కులన్నింటినీ ముంచెత్తి వెన్నెల’ సముద్రంలా వ్యాపించింది. ఆ వెన్నెల అనే సముద్రపు నీటి నుండి చంద్రుడు ఆవిర్భవించాడు.
ఆ విధంగా అందంగా, గంభీరంగా, నిండుగా చంద్రుని వెన్నెల వ్యాపించింది.
3. కింది అంశాల గురించి సృజనాత్మకంగా ప్రశంసిస్తూ రాయండి.
అ) ఈ పాఠంలోని వర్ణనల్లాగే మీకు నచ్చిన ఒక ప్రకృతి దృశ్యాన్ని గాని, సన్నివేశాన్ని గాని, సమయాన్ని గాని వర్ణిస్తూ రాయండి.
ఉదా : సూర్యోదయం/ సూర్యాస్తమయం.
జవాబు:
సూర్యోదయం :
చీకటి అనే అజ్ఞానంలో తడబడుతూ అనేక అవలక్షణాలకు ఆలవాలమైన వానికి జ్ఞానం ప్రసాదించే సద్గురువులా సూర్యుడు తూర్పుతలుపు తీస్తున్నాడా అన్నట్లు వెలుగు రేఖలు వస్తున్నాయి. ఆ లేత వెలుగు సోకగానే లోకమంతా ఉత్సాహం ఉరకలేసింది. పక్షుల కిలకిలలు, లేగదూడల గెంతులు, అంబారవాలు, పిల్లల మేలుకొలుపులు, సంధ్యావందనాదులు, ఒకటేమిటి అప్పటి వరకు బద్దకంగా, నిస్తేజంగా నిద్రించిన యావత్ప్రపంచం దైనందిన క్రియలకు బయల్దేరింది. కొలనులలో తామరపూలు పరవశంతో తమ ఆప్తుని చూడటానికి రేకులనే కళ్లతో ఆత్రంగా నింగిని పరికిస్తున్నాయి. ఆ పూల అందాలను చూసి పరవశించిన తుమ్మెదలు ఝంకారం చేస్తూ తేనెల వేటకు ఉపక్రమించాయి.
రైతులు బద్దకం వదిలి నాగలి భుజాన వేసుకొని పొలాలకు బయల్దేరారు. మహిళలు కళ్ళాపి జల్లి వాకిట రంగ వల్లికలు తీరుస్తున్నారు. పిల్లలు పుస్తకాలు ముందేసుకొని ఆవులిస్తూ చదవడం మొదలుపెట్టారు.
లేత సూర్యకిరణ ప్రసారంతో చైతన్యం పెరిగిన జీవరాశి జీవనయాత్రకు నడుం బిగించింది.
సూర్యాస్తమయం :
నవ్వుతూ, తుళ్ళుతూ జీవితమంతా గడిపిన వ్యక్తిని వార్ధక్యం ఆవహించినట్లుగా, తుపాసులో సర్వం కోల్పోయిన వ్యక్తి జీవితంలాగా, వైభవం కోల్పోయిన చక్రవర్తిలాగా సూర్యుడు తన వేడిని, వాడిని ఉపసంహరించు కొంటున్నాడు. పక్షులు గబగబా గూళ్లకు చేరుకొంటున్నాయి. మేతకు వెళ్ళిన పశువులమందలు, ఇళ్లకు చేరుతున్నాయి. ఎక్కడి పనులక్కడ ఆపి, కర్షకులు తల పైన పచ్చగడ్డి మోపులతో ఇళ్లకు ప్రయాణమయ్యారు. నిషేధాజ్ఞలు జారీ అయినట్లు సూర్యుడు బెరుకుబెరుకుగా పడమటి కొండలలోకి పారిపోయాడు. పెద్ద దిక్కు కోల్పోయిన కుటుంబంలా ప్రపంచం కళా విహీనమయ్యింది. దరిద్రుడిని కష్టాలు ఆక్రమించినట్లుగా లోకాన్ని చీకటి ఆక్రమిస్తోంది. క్రూరత్వానికి, దుర్మార్గానికి, అన్ని పాపాలకు చిరునామా అయిన చీకటి దర్జాగా నవ్వుకొంటోంది. దండించే నాథుడు లేని లోకంలో అరాచకం ప్రబలినట్లుగా సూర్యుడు లేకపోవడంతో చీకటి విజృంభిస్తోంది, మూర్ఖుల ప్రేలాపనలతో సజ్జనులు మౌనం వహించినట్లుగా మెల్లగా పడమటి తలుపులు మూసుకొని సూర్యుడు చీకటిని చూడలేక నిష్క్రమించాడు.
ఆ) పాఠం ఆధారంగా ఎఱ్ఱన రచనా శైలి గురించి 10 వాక్యాలు రాయండి.
జవాబు:
ప్రబంధ పరమేశ్వరుడనే బిరుదు గల ఎఱ్ఱన వర్ణనలు అద్భుతంగా చేస్తాడు. వర్ణనాంశానికి తగిన పదాలను, పద్యవృత్తాలను ఎన్నుకొంటాడు.
‘ఇను ససమాన తేజు’ అనే పద్యంలో సూర్యుని చూచినట్లు ‘భృంగ తారకాల’ను చూడలేని పద్మిని కళ్లుమూసుకొన్నట్లు పర్ణించాడు. దీనిని ‘చంపకమాల’ వృత్తంలో వర్ణించాడు. ‘చంపకము’ అంటే సంపెంగపువ్వు అని అర్థం. పద్యంలో ‘భృంగము’ అని పదం ప్రయోగించాడు. భృంగము అంటే తుమ్మెద అనే అర్థం. తుమ్మెద అన్ని పూలపైనా వాలుతుంది. తానీ సంపెంగపై వాలదు. సంపెంగ వాసనకు తుమ్మెదకు తలపోటు వచ్చి మరణిస్తుంది. ఆ విషయం అన్యాపదేశంగా చెప్పడానికే చంపకమాల వృత్తంలో చెప్పాడు, అంటే తుమ్మెదకు ప్రవేశం లేదని చెప్పే పద్యం కదా!
అలాగే పద్మిని అనేది కూడా ఒక జాతి స్త్రీ, పద్మినీజాతి స్త్రీ తన భర్తను తప్ప పరపురుషుల గూర్చి విసదు, చూడదు, ఇక్కడ తామర పువ్వు సూర్యుని తప్ప ఇతరులను (తుమ్మెదలను) చూడడానికి అంగీకరించక కళ్లు మూసుకొంది. అందుకే తామరకు ‘పద్మిని’ అని ప్రయోగించాడు.
(ఇదే విధంగా ప్రతి పద్యంలోనూ విశేషాలు ఉన్నాయి.)
భాషా కార్యకలాపాలు ప్రాజెక్టు పని
‘నరసింహస్వామి కథ’ నేపథ్యంతో వచ్చిన గ్రంథాలు, వివరాలను ఈ కింది పట్టికలో రాయండి.
III. భాషాంశాలు
పదజాలం
1) కింది వాక్యాల్లో గీత గీసిన మాటల అర్థాన్ని గ్రహించి, వాటిని అర్థవంతంగా సొంతవాక్యాల్లో ఉపయోగించండి.
అ. భరతమాత స్మితకాంతి అందరినీ ఆకట్టుకున్నది.
జవాబు:
స్మితకాంతి = నవ్వుల వెలుగు
సొంతవాక్యం :
ముద్దులొలికే పసిపాప నవ్వుల వెలుగులో ఇల్లు కళకళలాడుతుంది.
ఆ. మేఘం దివి నుండి భువికి రాల్చిన చినుకుపూలే ఈ వర్షం.
జవాబు:
దివి = ఆకాశం
సొంతవాక్యం :
ఆకాశం నక్షత్రాలతో పెళ్ళి పందిరిలా శోభిల్లుతోంది.
ఇ. కష్టాలు మిక్కుటమై రైతులు ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు.
జవాబు:
మిక్కుటము = ఎక్కువ
సొంతవాక్యం :
కోపం ఎక్కువైతే ఆరోగ్యం పొడవుతుంది.
ఈ. రజనీకరబింబం రాత్రిని పగలుగా మారుస్తున్నది.
జవాబు:
రజనీకరబింబం = చంద్రబింబం
సొంతవాక్యం :
పున్నమినాడు నిండైన చంద్రబింబం చూసి సముద్రం ఉప్పొంగుతుంది.
2) నిఘంటువు సాయంతో కింది పదాలకు నానార్థాలు వెతికి రాయండి.’
అ. వెల్లి = ప్రవాహము, పరంపర
ఆ. కుండలి = పాము, నెమలి, వరుణుడు
ఇ. నిట్టవొడుచు = ఉప్పొంగు, రోమాంచితమగు, విజృంభించు
3) కింది మాటలకు పర్యాయపదాలు రాయండి.
అ. చాడ్పు = పగిది, విధము , వలె
ఆ. వెల్లి = ప్రోతస్సు, వెల్లువ, ప్రవాహము
ఇ. కైరవం = తెల్లకలువ, కుముదము, గార్దభము, చంద్రకాంతము, సృకము, సోమబంధువు
ఈ. కౌముది . . వెన్నెల, జ్యోత్స్న, చంద్రిక
ఉ. చంద్రుడు = శశి, నెలవంక, అబారి
ఊ. తమస్సు/తమం = చీకటి, ధ్వాంతము, తిమిరము
4) కింది ప్రకృతి పదాలకు వికృతి పదాలు రాయండి.
అ. సంధ్య – సంజ
ఆ. దిశ – దెస
ఇ. ధర్మము – దమ్మము
ఈ. రాత్రి – రాతిరి, రేయి
ఉ. నిశ – నిసి
5) కింది వికృతి పదాలకు ప్రకృతి పదాలు రాయండి. అ, సంధ్య
అ. గరువము – గర్వము
ఆ. జతనము – యత్నము
ఇ. దెస – దిశ
ఈ. ‘చందురుడు – చంద్రుడు
వ్యాకరణాంశాలు
1. కింది సంధులకు సంబంధించిన పదాలు ఈ పాఠంలో గుర్తించి, వాటిని విడదీసి సూత్రాలు రాయండి.
అ) సవర్ణదీర్ఘ సంధి
సూత్రము :
అ, ఇ, ఉ, ఋ లకు అవే (సవర్ణ) అచ్చులు పరములయినచో వానికి దీర్ఘములు వచ్చును. పాఠంలో గుర్తించినవి.
రజని + ఈశ్వరుడు = రజనీశ్వరుడు – (ఇ + ఈ = ఈ)
కులిశ + ఆయుధుని = కులిశాయుధుని – (అ + ఆ = ఆ)
ఉత్సుక + ఆకృతిన్ = ఉత్సుతాకృతిన్ (అ + ఆ = ఆ)
చంద్రిక + అంభోధి = చంద్రికాంభోధి – (అ + అ = అ)
ఆ) గుణసంధి
సూత్రము :
అకారమునకు ఇ, ఉ, ఋ లు పరమైన వానికి క్రమముగా ఏ, ఓ, అర్లు ఆదేశమగును. పాఠంలో గుర్తించినవి.
దివస + ఇంద్రు = దివసేంద్రు – (అ + ఇ = ఏ)
చంద్రకాంత + ఉపలంబుల = చంద్రకాంతో పలంబుల – (అ + ఉ = ఓ)
నుత + ఇందు = నుతేందు – (అ + ఇ = ఏ)
ఇ) ఉత్వసంధి
సూత్రము :
ఉత్తునకచ్చు పరమగునపుడు సంధియగు పాఠంలో గుర్తించినవి.
పొమ్ము + అనన్ = పొమ్మనన్ – (ఉ + అ = అ)
మీలనము + ఒంద = మీలనమొంద – (ఉ + ఒ = ఒ)
తిలకము + అనగ = తిలకమనగ – (ఉ + అ = అ)
కుంభము + అనగ = కుంభమనగ – (ఉ + అ = అ)
దీపము + అనగ = దీపమనగ – (ఉ + అ = అ)
కబళము + అనగ = కబళమనగ – (ఉ + అ = అ)
చంద్రుడు + ఉదయించె = చంద్రుడుదయించె – (ఉ + ఉ = ఉ)
నిస్తంద్రుడు + అగుచు = నిస్తంద్రుడగుచు – (ఉ + అ = అ)
ఇట్లు – ఉదయించి = ఇట్లుదయించి – (ఉ + ఉ = ఉ)
దీర్ఘములు + ఐన = దీర్ఘములైన – (ఉ + ఐ = ఐ)
ప్రియంబు + ఎసగగ = ప్రియంబెనగగ – (ఉ + ఎ – ఎ)
ఈశ్వరుడు + ఉన్నతలీల = ఈశ్వరుడున్నతలీల – (ఉ + ఉ = ఉ)
ఆకసము + అను = ఆకసమను – (ఉ + అ = అ)
కోయుటకు = ఒకో = కోయుటకొకో – (ఉ + ఒ – ఒ)
కలంకము + అత్తటిన్ = కలంకమత్తణిన్ – (ఉ + అ = అ)
ఱేకులు + ఉప్పతిల = ఱేకులుప్పతిల – (ఉ + ఉ = ఉ)
తలము + ఎక్కి = తలమెక్కి (ఉ + ఎ = ఎ)
పండువులు + ఐ = పండువులె – (ఉ + ఐ = ఐ)
సౌరభంబులు + ఉగ్గడువుగ = సౌరభంబులుగడువుగ – (ఉ + ఉ = ఉ)
ఇట్లు + అతి = ఇట్లతి – (ఉ + అ = అ)
2. కింది పదాలు విడదీసి, సంధులను గుర్తించి, సూత్రాలు రాయండి.
అ) అత్యంత = అతి + అంత – యణాదేశ సంధి.
సూత్రం :
ఇ, ఉ, ఋలకు అసవర్ణాచ్చులు పరమైన వానికి య,వ,రలు ఆదేశంగా వస్తాయి.
ఆ) వంటాముదము = వంట + ఆముదము – అత్వసంధి
సూత్రం :
అత్తునకు సంధి బహుళంబుగానగు.
ఇ) ఏమనిరి = ఏమి + అనిరి – ఇత్వసంధి
సూత్రం :
ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికముగానగు.
ఈ) అవ్విధంబున = ఆ + విధంబున – త్రికసంధి
సూత్రం :
- ఆ, ఈ, ఏలు త్రికమనబడును.
- త్రికంబుమీది అసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళంబుగానగు.
ఆ + వ్విధంబున - ద్విరుక్తంబగు హల్లు పరమగునపుడు’ డాచ్చికంబగు దీర్ఘమునకు హ్రస్వంబగు.
అవ్విధంబున
3. కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి, అవి ఏ సమాసాలో గుర్తించండి.
అ) నలుదెసలు – నాలుగైన దెసలు – ద్విగుసమాసం
లక్షణం : సమాసంలోని పూర్వపదం సంఖ్యావాచకమైతే అది ద్విగు సమాసం. నలు (నాల్గు) అనేది సంఖ్యావాచకమైన పూర్వపదం కనుక ఇది ద్విగు సమాసం.
ఆ) సూర్యచంద్రులు – సూర్యుడును, చంద్రుడును – ద్వంద్వ సమాసం లక్షణం : సమాసంలోని రెండు పదాలకూ ప్రాధాన్యం ఉంటే అది ద్వంద్వ సమాసం.
సూర్యుడు, చంద్రుడు అనే రెండు పదాలకూ ప్రాధాన్యం ఉంది కనుక ఇది ద్వంద్వ సమాసం.
4. కింది పద్యపాదాల్లోని అలంకారాన్ని గుర్తించండి, సమన్వయం చేయండి.
అ) అభినుతేందు చంద్రికాంభోధి యఖిలంబు
నీట నిట్టలముగ నిట్టవొడిచె.
జవాబు:
ఈ పద్యపాదములందు రూపకాలంకారం ఉన్నది.
సమన్వయం :
ఇక్కడ వెన్నెల అనే సముద్రము నుండి చంద్రుడు నిండుగా ఆవిర్భవించాడు అని చెప్పబడింది. పై పద్యపాదాల్లో ఉపమేయమైన వెన్నెలకు ఉపమానమైన సముద్రానికి అభేదం చెప్పబడింది. అందువల్ల ఇక్కడ రూపకాలంకారం ఉంది.
లక్షణం :
ఉపమాన ఉపమేయములకు అభేదం చెప్పినట్లయితే దానిని రూపకాలంకారం అంటారు.
5. పాఠంలోని తేటగీతి పద్యాన్ని గుర్తించి లక్షణాలతో సమన్వయం చేసి చూడండి.
జవాబు:
లక్షణాలు:
- 4 పాదాలుంటాయి.
- ప్రతి పాదంలోను ఒక సూర్యగణం, రెండు ఇంద్రగణాలు, రెండు సూర్యగణాలు వరుసగా ఉంటాయి.
- యతి – 4వ గణం యొక్క మొదటి అక్షరం.
- ప్రాస నియమం కలదు.
బొదలి పొదలి … అనే పద్యంలోని రెండు పాదాలు పరిశీలించి లక్షణ సమన్వయం చేయండి.
పై పద్యపాదాల్లో ప్రతి పాదానికి ఐదు గణాలుంటాయి. కాని,
(‘హ’ గణాన్నే ‘గలం’ అనడం వాడుకలో ఉన్నది. ‘వ’ గణాన్ని ‘లగం’ అన్నట్లు.)
యతి ప్రాస, నియమాలు, తేటగీతికి సంబంధించినవే దీనికీ వర్తిస్తాయి.
లక్షణాలు :
- ఇది ఉపజాతి పద్యం. దీనికి 4 పాదాలుంటాయి.
- 1, 3 పాదాల్లో వరుసగా మూడు సూర్యగణాలు, రెండు ఇంద్రగణాలు ఉంటాయి.
- 2, 4 పాదాల్లో ఐదూ సూర్యగణాలే ఉంటాయి.
- ప్రతి పాదంలో 4వ గణంలోని మొదటి అక్షరం యతి. యతిలేని చోట ప్రాసయతి చెల్లుతుంది.
- ప్రాస నియమం పాటించనవసరం లేదు. న
మొదటి పాదం వలెనే 3వ పాదం ఉంది.
దీనిలో కూడా 3 సూర్యగణాలు, రెండు ఇంద్ర గణాలు వరుసగా ఉన్నాయి.
రెండవ పాదం వలెనే 4వ పాదం ఉంది.
దీనిలో కూడా 5 సూర్యగణాలు వరుసగా ఉన్నాయి.
4 పాదాలలోనూ యతి 4వ గణం మొదటి అక్షరం.
1వ పాదం – పొ, పొం 2వ పాదం – మించి – ముంచి (ప్రాసయతి)
3వ పాదం – అ – అం 4వ పాదం – నీ – ని (ట్ట)
అదనపు సమాచారము
సంధులు
1) జగదండఖండము = జగత్ + అండఖండము – జశ్వసంధి
2) తదంతరము = తత్ + అంతరము జత్త్వసంధి
3) కాటుకగ్రుక్కిన = కాటుక + క్రుక్కిన – గసడదవాదేశ సంధి
4) నిట్టవొడిచే = నిట్ట + పొడిచే – గసడదవాదేశ సంధి
5) గ్రుక్కినట్టి = గ్రుక్కిన + అట్టి – అత్వసంధి
6) అత్తఱిన్ = ఆ = తఱిన్ – త్రికసంధి
7) గర్వంపుదాటులు = గర్వము + దాటులు – పుంప్వాదేశ సంధి
8) గరువపుసూత్రధారి = గరువము + సూత్రధారి – పుంప్వాదేశ సంధి
9) వేడ్క యొనర్చె = వేడ్క + ఒనర్చె – యడాగమ సంధి
10) లీలనమొందఁజేసె = లీలనమొందన్ + చేసె – సరళాదేశ సంధి
11) పెందెర = పెను + తెర – సరళాదేశ సంధి
12) నభోంగణము = నభః + అంగణము – విసర్గ సంధి
13) అంతరంగము = అంతః + అంగము , – విసర్గ సంధి
14) రంజనౌషధము = రంజన + ఔషధము వృద్ధి సంధి
సమాసాలు
ప్రకృతి – వికృతులు
1) సత్త్వము – సత్తువ
2) రాత్రి – రాతిరి, రేయి
3) యత్నము – జతనము
4) దిశ – దెస
5) ఆకాశము ఆకసము
6) స్రవణము – సోన
7) మాణిక్యము – మానికము
8) శంక – జంకు
9) విష్ణుడు – వెన్నుడు
పర్యాయపదాలు
1) కుసుమము : 1) సుమం 2) పుష్పం 3) పువ్వు
2) లలన : 1) సతి 2) స్త్రీ 3) ఇంతి
3) లోచనము : 1) నేత్రం 2) నయనం 3) కన్ను
4) చంద్రుడు : 1) రజనీశ్వరుడు 2) సుధాంశుడు 3) సోముడు
5) తోయధి : 1) అంభోధి 2) పయోనిధి 3) సముద్రం
నానార్థాలు
1) కరము : 1) చేయి 2) తొండం 3) కిరణం
2) తరంగము : 1) కెరటం 2) వస్త్రం 3) గుఱ్ఱపు దాటు
3) ఇనుడు : 1) సూర్యుడు 2) ప్రభువు
వ్యుత్పత్త్యర్థాలు
1) వనజాతము : నీటి నుండి పుట్టునది (పద్మం)
2) రజనీశ్వరుడు : రాత్రులకు ప్రభువు (చంద్రుడు)
3) రజనీకరుడు : రాత్రిని కలుగచేసేవాడు (చంద్రుడు)
4) పన్నగము : పాదములచే పోవనిది (పాము)
5) సుధాకరుడు : అమృతమయములైన కిరణాలు కలవాడు (చంద్రుడు)
6) భూరుహము : భూమి నుండి మొలచునది (చెట్టు)
కవి పరిచయం
కవిత్రయం :
సంస్కృతంలో వేదవ్యాస మహర్షి రచించిన 18 పర్వాల మహాభారతాన్ని నన్నయ, తిక్కన, ఎఱ్ఱన అనే ముగ్గురు మహాకవులు తెలుగులోకి అనువదించారు. దీనిలో నన్నయ రెండున్నర పర్వాలు, తిక్కన 15 పర్వాలు, ఎఱ్ఱన అరణ్యపర్వశేషం (నన్నయ వదిలిన భాగం) రచించారు.
ఎఱ్ఱన :
పోతమాంబిక, సూరనార్యుల పుత్రుడు. 14వ శతాబ్దంలో ప్రథమార్ధంలో అంటే క్రీ.శ 1300-1360 సం||లలో ఎఱ్ఱన జీవించాడు. ప్రోలయ వేమారెడ్డి ఆస్థానకవి.
ఎఱ్ఱన రచనలు :
అరణ్యపర్వశేషం, నృసింహపురాణం, రామాయణం, హరివంశం మొదలగు గ్రంథాలను రచించాడు. వీటిలో రామాయణం ప్రస్తుతం లభించడం లేదు. ‘రామాయణం’, ‘హరివంశం’లను ప్రోలయ వేమారెడ్డికి అంకితమిచ్చాడు. అరణ్యపర్వశేషాన్ని నన్నయ అంకితమిచ్చిన రాజరాజనరేంద్రునిపై గౌరవంతో ఆయనకే అంకితమిచ్చాడు. నృసింహపురాణాన్ని అహోోబిల నృసింహస్వామికి అంకితమిచ్చాడు.
ఎఱ్ఱన వర్ణనలు :
ఎఱ్ఱన రచనలో వర్ణనలు అధికంగా ఉంటాయి. తదనంతర కాలంలో వర్ణనాత్మకమైన కావ్యాలు రావడానికి ఎఱ్ఱన వర్ణనలే ప్రేరణ. ప్రబంధాలలోని అష్టాదశ (18) వర్ణనల్లోని చాలా వర్ణనలు నృసింహపురాణంలో కనిపిస్తాయి. ఎఱ్ఱన నృసింహపురాణ ప్రభావం పోతన మీద విశేషంగా ఉంది. పోతన భాగవతంలోని సప్తమ స్కంధంలోని ప్రహ్లాద చరిత్రలో ఈ ప్రభావం కనిపిస్తుంది.
బిరుదులు :
ప్రబంధ వర్ణనలకు మొదటివాడు కనుక ‘ప్రబంధ పరమేశ్వరుడు’ అను బిరుదు కలదు. శివభక్తుడగుటచేత ‘శంభుదాసుడు’ అను బిరుదు పొందాడు.
గురువు :
ఎఱ్ఱన గురువు గారి పేరు శంకరస్వామి,
అవగాహన – ప్రతి స్పందన
పద్యం -1
చ|| | ఇను ససమానతేజు దివసేంద్రుఁ గనుంగొనుమాడ్కిఁ జూడఁగాఁ
జన దొరు సల్పతేజు నను చాద్పునఁ జంచలభృంగతారకా
ఘన వనజాతలోచనము గ్రక్కున మీలన మొందఁజేసెఁబ
ద్మిని పతిభక్తి సత్త్వమున మేలిమికిం గుణి దానపొమ్మనన్.
ప్రతిపదార్థం :
అసమాన తేజున్ = సాటిలేని కాంతి గలవానిని
దివస + ఇంద్రున్ = పగటికి రాజును (అయిన)
ఇనున్ = సూర్యుని
కనున్ + కొనుమాడ్కిన్ = చూచునట్లుగా
పద్మిని = పద్మము (కమలము)
అల్పతేజుని = అల్పమైన తేజస్సు కలవానిని
ఒరున్ = ఇతరుని
చూడగాన్ = చూచుటకు
చనదు = ఒప్పదు
అను = అనెడు
చాడ్పునన్ = విధముగా
చంచల = చలించుచున్న
భృంగ = తుమ్మెదలనెడు
తారకా = తారకల యొక్క
ఘన = గొప్పదనమును (చూడక)
పతిభక్తి = భర్తపై ఇష్టం (సూర్యునిపై అభిమానము)
సత్త్వమున = బలమున
మేలిమికిన్ = గొప్పదనమునకు
గుటి = లక్ష్యము (ఉదాహరణ)
తాన = తానే (కమలమే)
పొమ్ము + అనన్ = పో అనగా (తాను మాత్రమే అనునట్లు)
గ్రక్కున = వెంటనే
వనజాత = కమలము
లోచనము = కన్నును
మీలన మొందన్ = మూసుకొనునట్లు
చేసెన్ = చేసెను
భావం :
పద్మము పతిభక్తిలో సాటిలేనిదా అనినట్లుండెను. అసమాన తేజస్సు కలవాడు, దినరాజు అయిన సూర్యుని చూచితిని. ఆ విధంగా అల్ప తేజస్సు గల ఇతరులను చూడను. చలించుచున్న తుమ్మెదలనెడు తారకలను చూడను అనునట్లుగా గొప్పవైన తన కన్నులను పద్మము వెంటనే మూసుకొన్నది.
పద్యం – 2: కంఠస్థ పద్యం
*చం. సురుచిరతారకాకుసుమశోభి సభాంగణభూమిఁ గాలను
పరువపు మాత్రధారి జతనంబున దికృతికోటి ముందటన్
సరసముగా నటింపగ విశానతి కెత్తిన క్రొత్తతోఁపుఁబెం
దెరయన నొప్పి సాంధ్యనవదీధితి పశ్చిమదిక్తటంబునన్.
ప్రతిపదార్థం :
సురుచిర తారకాకుసుమ శోభి నభోంగణ భూమిన్; సురుచిర = చాలా అందమైన
తారకా = నక్షత్రాలనే (చుక్కలనే)
కుసుమ = పూలచే
శోభి = అలంకరింపబడిన
నభః = ఆకాశమనే
అంగణభూమిన్ = రంగస్థలంపై (వేదికపై)
కాలమన్ (కాలము + అన్) = కాలం అనే
గరువపు సూత్రధారి; గరువపు = గొప్ప
సూత్రధారి = సూత్రధారి (దర్శకుడు) (నాటకం ఆడించేవాడు)
జతనంబునన్ = ప్రయత్నపూర్వకంగా
దిక్పతికోటి ముందటన్; దికృతికోటి = దిక్పాలకుల సమూహం
ముందటన్ = ముందు (ఎదుట)
సరసముగాన్ = చక్కగా (తగువిధంగా)
నటింపగన్ = నటించడానికి (నాట్యం చేయడానికి సిద్ధపడిన)
నిశాసతికిన్ = రాత్రి అనే స్త్రీకి (అడ్డంగా)
ఎత్తిన = నిలిపిన (పట్టిన)
క్రొత్తతోఁపుపెందెర; క్రొత్త = క్రొత్తదైన
తోఁపు= ఎర్రని రంగు గల (తోపు రంగు గల)
పెందెర (పెను + తెర) : పెద్ద తెర యేమో
అనన్ = అన్నట్లుగా
పశ్చిమ దిక్తటంబునన్; పశ్చిమదిక్ = పడమటి దిక్కు యొక్క
తటంబునన్ = తీరంలోని
సాంధ్య నవదీధితి; సాంధ్య = సంధ్యకు సంబంధించిన (సంధ్యాకాలపు)
నవదీధితి = కొత్త వెలుగు
ఒప్పెన్ = ప్రకాశించింది
భావం :
ప్రకాశించే చుక్కలనే పూవులతో అలంకరింపబడిన ఆకాశం అనే రంగస్థలం మీద, కాలం అనే గొప్ప సూత్రధారి (దర్శకుడు) ప్రయత్నం వల్ల, దిక్పాలకుల సమూహం ముందు, రాత్రి అనే స్త్రీ రసవంతముగా నాట్యం చేయడానికి రాగా, ఆమె ముందు పట్టుకొన్న లేత ఎరుపు రంగు (తోపు రంగు) తెర ఏమో అనేటట్లుగా, సంధ్యాకాలపు కొత్త కాంతి, పడమట దిక్కున ప్రకాశించింది.
విశేషం :
సంధ్యాకాలమయ్యింది. పడమటి దిక్కున ఆకాశం ఎఱుపురంగులో కనబడుతోంది. ఆకాశంలో నక్షత్రాలు వచ్చాయి. రాత్రి వస్తోంది. అది తన చీకటిని సర్వత్రా వ్యాపింపచేస్తుంది.
కవి సంధ్యాకాలం వెళ్ళిన తర్వాత జరిగిన మార్పుల్ని కాలము అనే సూత్రధారి ఆడించిన నాటక ప్రదర్శనగా ఊహించాడు.
- ఇక్కడ కాలము అనేది సూత్రధారుడు వలె ఉంది.
- సంధ్యాకాలంలో పడమటి దిక్కున కన్పించిన ఎజ్యని కాంతి, నాటకంలో కట్టిన ఎఱ్ఱని తోపురంగు తెరలా ఉంది.
- చుక్కలతో కూడిన ఆకాశం, పువ్వులతో అలంకరించిన నాట్య రంగస్థలంలా ఉంది.
- రాత్రి అనే స్త్రీ, ‘నర్తకి’ వలె ఉంది.
రాత్రి అనే స్త్రీ చేయబోయే నాట్యానికి రంగస్థలం మీద కట్టిన ఎల్లరంగుతోపు తెరవలె పడమటి దిక్కున ఆకాశంలో సంధ్యాకాంతి కనబడింది.
కవి సంధ్యాకాలాన్ని పూర్వపు నాటక సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ అద్భుతంగా వర్ణించాడు.
పద్యం – 3
తే॥ | పొదలి యొందొండ దివియును భువియు దిశలుఁ
బొదివి కొనియుందు చీకటిప్రోవు వలన
మిక్కుటంబుగఁ గాటుక గ్రుక్కినట్టి
(కరవటంబన జగదందఖండ మమరి.
ప్రతిపదార్థం :
పొదలి = వృద్ధి చెంది
దివియును = ఆకాశమును
భువియు = భూమియును
దిశలున్ = దిక్కులును
ఒండు + ఒండు + అ = ఒకదానితో ఒకటి
పొదివికొని + ఉండు = దగ్గరకు చేర్చుకొని ఉన్నటువంటి
చీకటిప్రోవు = చీకటి యొక్క కుప్ప
వలన = వలన
మిక్కుటంబుగన్ = ఎక్కువగా
కాటుకన్ = (నల్లని) అంజనమును
క్రుక్కినట్టి = నిండా కూరినటువంటి
కరవటంబు + అన : భరిణె అనునట్లు (కాటుక భరిణ వలె)
జగత్ = లోకమనెడు
అండఖండము – బ్రహ్మాండములోని భాగము
అమరె = ఏర్పడినది (ఉన్నది)
భావం :
ఆకాశం, భూమి, దిక్కులు, చీకటి ఒకదానిలో ఒకటి కలిసిపోయాయి. చీకటి ఈ లోకము అనెడు బ్రహ్మాండ భాగం కాటుక భరిణలాగ ఉంది.
వచనం -4
అంత,
అంత = అంతట
ఆలోచించండి – చెప్పండి
ప్రశ్న 1.
రెండో పద్యంలో కవి దేనిని దేనితో పోల్చాడు? ఎందుకు?
జవాబు:
చుక్కలను పూలతో, ఆకాశమును వేదికతో, కాలమును సూత్రధారితో, దిక్పాలకులను రసజ్ఞులైన ప్రేక్షకులతో, రాత్రిని నాట్యకత్తెతో, పడమటి సంధ్య వెలుగును పరదాతో కవి పోల్చాడు.
ఎందుకంటే నక్షత్రాలకు పూలకు రాలే గుణం, అందగించే గుణం, ప్రకాశించే గుణం, ఆకర్షించే గుణం, అందీ అందనట్లు మురిపించే గుణం ఉంటుంది.
ఆకాశము-వేదిక విశాలమైనవి. అలంకరింప బడినవి. నటులకు తప్ప ఎవరికీ స్థానం లేనివి.
కాలానికి సూత్రధారికి పరిమితి లేదు. ఎవరైనా లోబడవలసిందే. ‘దిక్పాలకులు-ప్రేక్షకులు’, సాక్షులు. వేదిక చుట్టూ ఉండి చూస్తారు.
‘రాత్రి – నాట్యకత్తె’ తనవంతు పూర్తవగానే వెళ్ళిపోవాలి. వేదికంతా వీరి అధీనంలోనే ఉంటుంది.
“సంధ్య – పరదా’ పరిస్థితిని బట్టి వెలుగు-చీకటుల గతులు మార్చుకొంటాయి.
ప్రశ్న 2.
ఆకాశాన్ని కవి ఏమని వర్ణించాడు? రాత్రివేళ చుక్కలతో కూడిన ఆకాశాన్ని చూస్తే మీకెలా అన్పిస్తుంది?
జవాబు:
ఆకాశాన్ని కవి చక్కగా అలంకరింపబడిన వేదికతో పోల్చాడు. చుక్కలతో ఉన్న ఆకాశం-చుక్కల చీరలో, సంక్రాంతికి ముగ్గులు పెట్టడానికి గాను చుక్కలు పెట్టిన వాకిలిలా, పిండి వడియాలు పెట్టిన వస్త్రంలా, రేఖా గణితపు నల్లబల్లలాగా, వినాయకచవితికి కట్టే పాలవెల్లిలా, అనేక జంతువుల (మేషం, వృషభాది రాశులు) వలె, ఇంకా అనేక విధాల కనిపిస్తుంది.
పద్యం – 5 : కంఠస్థ పద్యం
*చ దెసలను కొమ్మ లొయ్య వతిదీర్ఘములైన కరంబులన్ బ్రియం
వినఁగఁగ మాది విక్కి రణవీశ్వరుఁ డుప్పతలీలఁ బేర్చు నా
కన మమ పేరి భూరుహము శాంతనిరంతర తారకాలస
త్కుసుమ చయంబు గోయుటకొకో యవఁ బ్రాఁకె సముత్సుకాకృతిన్.
ప్రతిపదార్ధం :
రజనీశ్వరుడు (రజనీ + ఈశ్వరుడు) = రాత్రికి ప్రభువైన చంద్రుడు
దెసలను (దెసలు + అను) = దిక్కులు అనే
కొమ్మలు = కొమ్మలను
ఒయ్యన్ = మెల్లగా
అతిదీర్ఘములైన = మిక్కిలి పొడవైన
(అతిదీర్ఘములు + ఐన) కరంబులన్ = కిరణాలు అనే (తన) చేతులతో
ప్రియంబు + ఎసగగన్ = మిక్కిలి ప్రేమతో
ఊది = పట్టుకొని
నిక్కి = పైకి లేచి
ఉన్నత లీలన్ = ఎత్తయిన విధంగా
పేర్చు = అతిశయించిన (విస్తరించిన)
ఆకసము = ఆకాశం
అను పేరి = అనే పేరు గల
భూరుహము = చెట్టు యొక్క
కాంతనిరంతర తారకా లసత్కుసుమచయంబు; కాంత = ఇంపైన (మనోహరమైన)
నిరంతర = మిక్కిలి దగ్గరగా ఉన్న
తారకా = నక్షత్రాలు అనే
లసత్ = ప్రకాశిస్తున్న
కుసుమచయంబు = పుష్ప సమూహాన్ని
కోయుటకున్ + ఒకో + అనన్ = కోయడం కోసమా అన్నట్లుగా సముత్సుకాకృతిన్ (సముత్సుక + ఆకృతిన్)
సముత్సుక = మిక్కిలి ఆసక్తి గల
ఆకృతిన్ = ఆకారంతో
ప్రాకెన్ = (ఆకాశంలోకి) వ్యాపించాడు.
భావం:
చంద్రుడు, దిక్కులనే కొమ్మలను మెల్లగా తన పొడవైన కిరణాలనే చేతులతో ఇష్టంగా పట్టుకొని, పైకి లేచి ఆకాశం అనే పేరుతో ఉన్న చెట్టు యొక్క మనోహరమైన నక్షత్రాలు అనే పువ్వులను కోయడం కోసమా అన్నట్లుగా, మిక్కిలి ఆసక్తిగా ఆకాశంలోకి పాకాడు. (చంద్రుని కాంతి ఆకాశమంతా వ్యాపించిందని భావం)
అలంకారం :రూపకం, ఉత్ప్రేక్ష.
పద్యం – 6
ఉ॥ వెన్నెలవెళ్లి పాల్కడలి వేఁకదనంబునఁ బేర్చి దిక్కులున్
మిన్నును ముంప నందు రజనీకరబింబము కుందరీ భవ
త్పన్నగతల్పకల్పనము భంగిఁ దనర్చిం దదంతరంబునన్
వెన్ను నిభంగిఁ జూద్కులకు వేర్మయొనర్చెఁ గలంత మత్తజిన్.
ప్రతిపదార్థం :
వెన్నెల వెల్లి = వెన్నెల ప్రవాహమనెడు
పాల్కడలి = పాల సముద్రము
ప్రేకదనంబున = భారముతో
పేర్చి = ఏర్పరచి (ప్రసరింపచేసి)
దిక్కులున్ = దిశలును
మిన్నును = ఆకాశమును
ముంప నందు = ముంచగా
రజనీకర బింబము = చంద్రబింబం
కుండలీభవత్ = చుట్టలు చుట్టుకొనియున్న
పన్నగతల్ప = శేషపాన్పు
కల్పనము భంగి = కల్పింపబడిన విధముగా
తనర్చెన్ = ప్రకాశించెను
ఆ + తటిన్ = ఆ సమయంలో
తత్ = దాని (శేష పాన్పువంటి చంద్రుని)
అంతరంబునన్ = లోపల గల
కలంకము = మచ్చ
చూడ్కులకు = చూపులకు
వెన్నుని భంగి = విష్ణువు వలె
వేడ్క = వేడుకను
ఒనర్చెన్ = కలిగించెను
భావం :
వెన్నెల ప్రవాహం పాల సముద్రం లాగ ఉంది. అది అన్ని దిక్కులను, ఆకాశాన్ని ముంచెత్తుతోంది. ఆ సమయంలో చంద్రుడు చుట్టలు చుట్టుకొన్న ఆదిశేషువులాగ ఉన్నాడు. చంద్రునిలోని మచ్చ నల్లని విష్ణువు వలె ఉంది.
ఇది తెలుసుకోండి :
విష్ణువు నల్లగా ఉంటాడు. ఆయన పవ్వళించే శేషుడు తెల్లగా ఉంటాడు. శివుడు తెల్లగా ఉంటాడు. ఆయన మెడలో ధరించే వాసుకి నల్లగా ఉంటుంది.
ఆలోచించండి – చెప్పండి
ప్రశ్న 1.
“చంద్రోదయాన్ని” చూస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది?
జవాబు:
అమ్మ జోలపాటను గుర్తుకు తెస్తుంది. అమ్మ తినిపించిన గోరుముద్దలు గుర్తుకు వస్తాయి. పాలమీగడ, పెరుగుబిళ్ళ గుర్తుకు వస్తుంది. ఎలాగైనా చంద్రమండలం పైకి వెళ్ళి, అక్కడ ఏముందో చూడాలనిపిస్తుంది.
ప్రశ్న 2.
నిండు పున్నమినాడు చంద్రబింబాన్ని చూస్తే ఏమేమి ఉన్నట్లుగా అనుభూతి చెందుతాము?
జవాబు:
ఆ వెన్నెలలో తనివితీరా ఆదుకోవాలనిపిస్తుంది. చంద్రుణ్ణి చూస్తూ పరుగెడితే మనకూడా చంద్రుడు వస్తున్నట్లుగా అనిపిస్తుంది.
ఆకాశంలో పెద్ద మెర్క్యురీ లైటు ఉన్నట్లుగా అనిపిస్తుంది. చంద్రుడు చల్లని సూర్యుడిలా కనిపిస్తాడు. ఆ వెన్నెలలో చదువుకోగలనో లేదో చూడాలనిపిస్తుంది.
ప్రశ్న 3.
పౌర్ణమి నాటి కలువలను చూస్తుంటే కలిగే ఆనందం ఎలా ఉంటుంది?
జవాబు:
పిండారబోసినట్లుగా తెల్లని వెన్నెలలో కలువలు ఉన్న కొలనును చూస్తే చాలా ఆనందం కలుగుతుంది. సున్నితమైన రేకులతో ఉన్న కలువలను చేతితో తాకాలనిపిస్తుంది. వాటితో బుగ్గలపై రాసుకోవాలని పిస్తుంది. వాటిని కెమెరాతో ఫోటోలు తీసి దాచుకోవాలని పిస్తుంది. వీడియో తీసుకోవాలనిపిస్తుంది. వెన్నెలలో కలువలను చూస్తుంటే, చదువు-మార్కులు, ఆటలుపాటలు, అల్లరి-గిల్లికజ్జాలు, తిండి-నిద్ర ఏమీ గుర్తురానంత ఆనందం కలుగుతుంది.
ప్రశ్న 4.
‘రజనీకర బింబం’ అని కవి దేన్ని గురించి అన్నాడు?
జవాబు:
రజనీకర బింబం అని కవి చంద్రుని గురించి అన్నాడు. వెన్నెల పాలసముద్రంలా, చంద్రుడు పాలసముద్రంలోని ఆదిశేషునిలాగా, చంద్రునిలోని మచ్చ విష్ణువులాగా కనిపించిందని కవి అన్నాడు.
పద్యం – 7 : కంఠస్థ పద్యం
*చ వడిగొని చేకులుప్పతిల వాలిన కేసరముల్ దలిర్పఁబు
పాడి దలమెకి, తేనియలు పొంగి తరంగలుగా జెలంగి పైఁ
ఐదు నెలదేఁటిదాఁటులకు బండువులై నవసారభంబు లు
గ్గడుపున మల్ల సిల్లె ఘనకైరవషండము నిండువెన్నెలన్.
ప్రతిపదార్థం :
ఘనకైరవషండము: ఘన ఘన = గొప్పవైన
కైరవ = కలువ పూల యొక్క
షండము = సముదాయం
నిండు వెన్నెలన్ = ఆ నిండైన వెన్నెలలో
వడిగొని = వేగం కలిగి (వేగంగా)
ఱేకులు = (తమ) పూలరేకులు
ఉప్పతిలన్ = విచ్చుకొనగా
వాలిన = కిందికి వాలిన
కేసరముల్ = కింజల్కములు (తామరపువ్వు బొడ్డు చుట్టూ ఉండే అకరువులు)
తలిర్సన్ = తలఎత్తి కన్పడగా
పుప్పొడిన్ = పుప్పొడితో
దలమెక్కి = దళసరియయి (రేకులు దళసరి అయి)
తేనియలు = మకరందాలు
పొంగి = పొంగి
తరంగలుగాన్ = కెరటాలుగా
చెలంగి = విజృంభించి
పైఁబడు = తమపైన వాలేటటువంటి
ఎలతేటి = లేత తుమ్మెదల
దాఁటులకున్ = గుంపులకు
పండువులై = విందు చేసేవయి
నవసౌరభంబులు – క్రొత్త పరిమళాలు
ఉగ్గడువుగన్ = మిక్కిలి అధికంగా
ఉల్లసిల్లెన్ = బయలుదేరాయి
భావం :
ఆ నిండు వెన్నెలలో కలువల రేకులు బాగా విచ్చు కున్నాయి. వాలిన కేసరాలు తలలెత్తాయి. పుప్పొడితో రేకులు దళసరియై, తేనెలు పొంగి కెరటాలుగా విజృంభించాయి. కలువలపై వాలే తుమ్మెదల గుంపులకు విందు చేస్తూ, కొత్త సువాసనలు అధికంగా బయలుదేరాయి.
అలంకారం : స్వభావోక్తి
పద్యం – 8
సీ॥ | కరఁగెడు నవచంద్రకాంతోపలంబుల
తఱచు సోనలఁ గడు దలముకొనుచుఁ
జటుల చకోరసంచయముల యెఱకల
గర్వంపుదాఁటులఁ గడలుకొనుచు
విరియు కైరవముల విపుల రంధ్రములపైఁ
దీవంబుగాఁ గ్రమ్మి త్రిప్పుకొనుచుఁ
గామినీజనముల కమనీయవిభ్రమ
స్మితకాంతిలహరుల మెందుకొనుచుఁ
ఆ॥వె॥ బొదలిపొదలి చదలఁ బొంగారి పొంగారి
మించి మించి దిశలు ముంచిముంచి
యభినుతేందు చంద్రికాంభోధి యఖిలంబు
నీట నిట్టలముగ నిట్టవొదిచె.
ప్రతిపదార్థం :
అభినుత = మిక్కిలి పొగడబడిన
ఇందు = చంద్రుని
చంద్రిక = వెన్నెల అనెడు
అంభోధి = సముద్రము
కరగెడు = కరుగుతున్న
నవ = క్రొత్తదైన
చంద్రకాంత = చంద్రకాంతములనెడు
ఉపలంబుల = ఱాళ్ళను
తఱచు = ఎక్కువగా
సోనలన్ = తుంపరలతో (అల్ప వర్షంతో)
కడు = ఎక్కువగా
తలముకొనుచున్ = తడుపుతూ
చటుల = చలించు
చకోరపక్షుల = చక్రవాక పక్షుల
సంచయముల = సమూహముల యొక్క
ఎఱకల = ఱెక్కల
గర్వంపుదాటులన్ = గర్వము గల కదలికలను
కడలుకొనుచు = అతిశయిస్తూ
విరియ = విరబూసిన
కైరవముల = కలువల
విపుల = ఎక్కువైన (అధికమైన)
రంధ్రముల పైన్ = రంధ్రాల మీద
తీవ్రంబుగాన్ = ఎక్కువగా
క్రమ్మి = ఆవరించి
త్రిప్పుకొనుచున్ = (తనవైపు) ఆకర్షిస్తూ
కామినీజనముల = స్త్రీల యొక్క
కమనీయ = అందమైన
విభ్రమ = అలంకారాదుల కాంతి
స్మిత = చిరునవ్వుల
కాంతిలహరుల = వెలుగు కెరటాలను
మెండుకొనుచున్ = ఎక్కువ చేస్తూ
పొదలి పొదలి = పెరిగి పెరిగి
చదలన్ = ఆకాశంలో
పొంగారి పొంగారి = పొంగిపొంగి (ఉప్పొంగి)
మించిమించి = బాగా అతిశయించి
దిశలు = దిక్కులు
ముంచిముంచి = బాగా మునుగునట్లు చేసి
నీటు + అ = మురిపముతో
నిట్టలముగ = అధికంగా
నిట్టవొడిచే = ఉప్పొంగెను.
భావం :
బాగా పొగడబడిన చంద్రకాంతి అనే సముద్రం ప్రపంచాన్ని ముంచింది. అది చాలా వ్యాపించింది. ఆకాశంలో ఉప్పొంగింది. దిక్కులు ముంచింది. చంద్రకాంత శిలలను తన ప్రవాహపు తుంపరలతో తడిపింది. చక్రవాక పక్షుల రెక్కల గర్వపు కదలికలను పెంచింది. విరబూస్తున్న కలువల రంధ్రాలపై వ్యాపించి తనవైపు ఆకర్షిస్తోంది. స్త్రీల అందమైన ఆభరణాల కాంతులను, వారి చిరునవ్వుల కాంతులను పెంచుతోంది.
వచనం -9
వ॥ ఇట్లతిమనోహర గంభీరధీరంబైన సుధాకర కాంతి
పూరంబు రాత్రి యను తలంపు దోఁవనీక తమంబను
నామంబును విననీక యవ్యక్తయను శంక నంకురింపనీక
లోచనంబులకు నమృత సేచనంబును, శరీరంబునకుఁ
జందనా సారంబును, నంతరంగంబునకు నానంద
తరంగంబును నగుచు విజృంభించిన సమయంబున
ప్రతిపదార్థం :
ఇట్లు = ఈ విధంగా (పైన పేర్కొన్న విధంగా)
అతి మనోహర = చాలా అందమైన
గంభీర = గంభీరమైన (నిండైన)
ధీరంబు + ఐన = ధైర్యము కలిగిన (అన్నిచోట్ల వ్యాపించిన)
సుధాకర = చంద్రుని (అమృత కిరణుని)
కాంతి పూరంబు = కాంతి సమూహము
రాత్రి + అను = రేయి అనెడు
తలంపున్ = ఆలోచనను
తోపనీక = తోచనివ్వక
తమంబను = చీకటి అనెడు
నామంబును = పేరును
వినన్ + ఈక = విననివ్వక
అవ్యక్త + అను = పరమాత్మ అను
శంకన్ = అనుమానమును
అంకురింపనీక = పుట్టనివ్వక
లోచనంబులకు = కళ్లకు
అమృతసేచనంబును = అమృతాభిషేకమును
శరీరంబునకున్ = శరీరానికి
చందన + ఆసారంబును = గంధపు వర్షమును
అంతరంగంబునకును = ఆత్మకును (మనస్సునకు)
ఆనంద = ఆనందమనెడు
తరంగంబును = కెరటమును
అగుచు = అవుతూ
విజృంభించిన = అతిశయించిన
సమయంబున = సమయంలో
భావం :
ఈ విధంగా వెన్నెల చాలా అందంగా ఉంది. గంభీరంగా ఉంది. ధైర్యంగా ఉంది. ఆ వెన్నెల రాత్రి అనే ఆలోచన కూడా రానివ్వడం లేదు. చీకటి అనే పేరు కూడా విననివ్వడం లేదు. పరమాత్మ అనే ఆలోచన కూడా పుట్టనివ్వడం లేదు. కళ్లకు ఆ వెన్నెల అమృతాభిషేకం చేస్తోంది. శరీరానికి మంచి గంధంలాగ ఉంది. అంతరాత్మకు బ్రహ్మానంద ప్రవాహం లాగ ఉంది.
ఇది తెలుసుకోండి:
వెన్నెల మన కళ్లకు అందంగా కనిపిస్తూ, రాత్రి అనే ఆలోచన రానివ్వక అమృతాభిషేకం చేసింది. శరీరానికి గంభీరంగా కనిపిస్తూ, భయం కలిగించే చీకటి అనే పేరును విననివ్వక గంధపు వర్షమైంది. ఆత్మకు కావలసినంత ధైర్యంగా కనిపిస్తూ, దైవాన్ని స్మరించే స్థితిని దాటించి, బ్రహ్మానందాన్ని కల్గించింది.
ఆలోచించండి – చెప్పండి
ప్రశ్న 1.
వెన్నెలను చూసిన కలువలు ఎలా ప్రతిస్పందించాయి?
జవాబు:
పండు వెన్నెలలో కలువలు తమ రేకులు అతిశయించగా వాడిపోయిన కేసరాలు ప్రకాశించాయి. పుప్పొడి పైన తేనె పొంగి ప్రవహించింది, పైన పడుతున్న చంద్రుని కలయికలతో పరవశించే కలువలు కనులపండువగా ఆనందంతో, క్రొత్త సౌరభాలతో ప్రకాశించాయి.
ప్రశ్న 2.
చంద్రుడు తన వెన్నెలతో ప్రపంచానికి ఆహ్లాదాన్ని ఎలా కలిగించాడు?
జవాబు:
ఆకాశమనే వృక్షానికి దిక్కులనే కొమ్మలలో గల నక్షత్రాలనే పూలను కోయుటకు చంద్రుడు నిలబడి పొడవైన తన కిరణాల (చేతుల) తో ఉత్సాహంగా కనిపిస్తూ ప్రపంచానికి ఆనందం కలిగించాడు.
వెన్నెల అనే పాలసముద్రంలో చంద్రుడు ఆదిశేషుని లాగా కనిపించాడు. చంద్రునిలోని మచ్చ శ్రీమహా విష్ణువులాగా కన్పించి భక్తులకు కూడా ఆనందాన్ని కలిగించాడు.
వెన్నెల చంద్రకాంత శిలలకు, చక్రవాక పక్షులకు, కలువలకు, అందమైన స్త్రీలకు, సమస్త చరాచర జగత్తుకీ ఆనందం కలిగిస్తోంది.
ప్రపంచానికి రాత్రి అనే ఆలోచన రానివ్వక, చీకటి అనే పేరు కూడా వినపడనివ్వకుండా, పరమాత్మను కూడా స్మరింపనీయక అమితమైన బ్రహ్మానందాన్ని వెన్నెల కలిగిస్తోంది.
ప్రశ్న 3.
‘పొదలి పొదలి చదలఁ బొంగారి పొంగారి మించి మించి దిశలు ముంచి ముంచి’ అనే పాదంలోని పద సౌందర్యం గురించి చెప్పండి.
జవాబు:
పొదలి, పొంగారి, మించి, ముంచి అనే పదాలు వ్యవధానం లేకుండా ప్రయోగించడం వలన పద్య పాదానికి చాలా అందం వచ్చింది. ఈ శబ్దాలు ఈ పద్యపాదానికి అలంకారాలు. ఇది ఛేకానుప్రాసా
లంకారంతో శోభిస్తోంది.
ప్రశ్న 4.
‘మనోహర గంభీర ధీరంబైన సుధాకర కాంతి పూరంబు’ దీని భావం ఏమిటి?
జవాబు:
మనస్సును ఆకర్షించగల అందమైన, గంభీరమైన, ధైర్యము గలిగిన అమృత కిరణుడైన చంద్రుని కాంతి ప్రవాహము.
AP Board Textbook Solutions PDF for Class 10th Telugu
- AP Board Class 10 Textbook Solutions PDF
- AP Board Class 10 Telugu Textbook Solutions PDF
- AP Board Class 10 Telugu Chapter 1 మాతృభావన Textbook Solutions PDF
- AP Board Class 10 Telugu Chapter 2 అమరావతి Textbook Solutions PDF
- AP Board Class 10 Telugu Chapter 3 జానపదుని జాబు Textbook Solutions PDF
- AP Board Class 10 Telugu Chapter 4 వెన్నెల Textbook Solutions PDF
- AP Board Class 10 Telugu Chapter 5 ధన్యుడు Textbook Solutions PDF
- AP Board Class 10 Telugu Chapter 6 శతక మధురిమ Textbook Solutions PDF
- AP Board Class 10 Telugu Chapter 7 మా ప్రయత్నం Textbook Solutions PDF
- AP Board Class 10 Telugu Chapter 8 సముద్రలంఘనం Textbook Solutions PDF
- AP Board Class 10 Telugu Chapter 9 మాణిక్యవీణ Textbook Solutions PDF
- AP Board Class 10 Telugu Chapter 10 గోరంతదీపాలు Textbook Solutions PDF
- AP Board Class 10 Telugu Chapter 11 భిక్ష Textbook Solutions PDF
- AP Board Class 10 Telugu Chapter 12 చిత్రగ్రీవం Textbook Solutions PDF
- AP Board Class 10 Telugu ఉపవాచకం రామాయణం Textbook Solutions PDF
0 Comments:
Post a Comment