AP Board Class 10 Telugu Chapter 7 మా ప్రయత్నం Textbook Solutions PDF: Download Andhra Pradesh Board STD 10th Telugu Chapter 7 మా ప్రయత్నం Book Answers |
Andhra Pradesh Board Class 10th Telugu Chapter 7 మా ప్రయత్నం Textbooks Solutions PDF
Andhra Pradesh State Board STD 10th Telugu Chapter 7 మా ప్రయత్నం Books Solutions with Answers are prepared and published by the Andhra Pradesh Board Publishers. It is an autonomous organization to advise and assist qualitative improvements in school education. If you are in search of AP Board Class 10th Telugu Chapter 7 మా ప్రయత్నం Books Answers Solutions, then you are in the right place. Here is a complete hub of Andhra Pradesh State Board Class 10th Telugu Chapter 7 మా ప్రయత్నం solutions that are available here for free PDF downloads to help students for their adequate preparation. You can find all the subjects of Andhra Pradesh Board STD 10th Telugu Chapter 7 మా ప్రయత్నం Textbooks. These Andhra Pradesh State Board Class 10th Telugu Chapter 7 మా ప్రయత్నం Textbooks Solutions English PDF will be helpful for effective education, and a maximum number of questions in exams are chosen from Andhra Pradesh Board.Andhra Pradesh State Board Class 10th Telugu Chapter 7 మా ప్రయత్నం Books Solutions
Board | AP Board |
Materials | Textbook Solutions/Guide |
Format | DOC/PDF |
Class | 10th |
Subject | Maths |
Chapters | Telugu Chapter 7 మా ప్రయత్నం |
Provider | Hsslive |
How to download Andhra Pradesh Board Class 10th Telugu Chapter 7 మా ప్రయత్నం Textbook Solutions Answers PDF Online?
- Visit our website - Hsslive
- Click on the Andhra Pradesh Board Class 10th Telugu Chapter 7 మా ప్రయత్నం Answers.
- Look for your Andhra Pradesh Board STD 10th Telugu Chapter 7 మా ప్రయత్నం Textbooks PDF.
- Now download or read the Andhra Pradesh Board Class 10th Telugu Chapter 7 మా ప్రయత్నం Textbook Solutions for PDF Free.
AP Board Class 10th Telugu Chapter 7 మా ప్రయత్నం Textbooks Solutions with Answer PDF Download
Find below the list of all AP Board Class 10th Telugu Chapter 7 మా ప్రయత్నం Textbook Solutions for PDF’s for you to download and prepare for the upcoming exams:10th Class Telugu 7th Lesson మా ప్రయత్నం Textbook Questions and Answers
ఉన్ముఖీకరణ : చదవండి – ఆలోచించి చెప్పండి
ఈ శతాబ్ది నాదే అని సగర్వంగా ప్రకటించుకున్న మహాకవి శ్రీశ్రీ. వారి మహాప్రస్థానం ఆధునిక తెలుగు సాహిత్యంలో దీపస్తంభంగా నిలబడింది. అటువంటి ప్రసిద్ధ కవితాసంపుటికి ప్రఖ్యాత రచయిత చలం ‘యోగ్యతాపత్రం’ అనే పేరుతో గొప్ప ముందుమాట రాశాడు. ఆ పీఠికలోని ప్రతి వాక్యం సాహితీ అభిమానుల నాలుకల మీద నాట్యం చేసింది. అందులోని కొన్ని వాక్యాలను చూడండి!
“తన కవిత్వానికి ముందుమాట రాయమని శ్రీశ్రీ అడిగితే,
కవిత్వాన్ని తూచే రాళ్ళు తన దగ్గర లేవన్నాడు చలం.”
“నెత్తురూ, కన్నీళ్ళూ కలిపి కొత్త టానిక్ తయారుచేశాడు
శ్రీశ్రీ ఈ వృద్ధ ప్రపంచానికి.”
ప్రశ్నలు – జవాబులు
ప్రశ్న 1.
పై పేరా ఏ విషయాన్ని గురించి తెలియజేస్తుంది?
జవాబు:
శ్రీశ్రీ రచించిన మహాప్రస్థానం పీఠిక (ముందుమాట) గురించి పై పేరా తెలియజేస్తోంది.
ప్రశ్న 2.
శ్రీశ్రీ పుస్తకానికి ఎవరు ‘ముందుమాట’ రాశారు?
జవాబు:
శ్రీశ్రీ పుస్తకానికి చలం ‘ముందుమాట’ ను రాశారు.
ప్రశ్న 3.
ముందుమాట ఎందుకు రాస్తారు?
జవాబు:
ఒక పుస్తకంలోని విషయాన్ని సమీక్షిస్తూ ముందుమాట రాస్తారు. ఆ పుస్తకంలోని మంచి, చెడులను గూర్చి ముందుమాట రాస్తారు. పుస్తకంలోని కీలకమైన విషయాలను, ఆశయాలను, తాత్వికతను తెలియజేయడానికి ముందుమాట రాస్తారు.
ప్రశ్న 4.
‘చలం’ శ్రీ శ్రీ గురించి రాసిన వాక్యాలు చదివారు కదా ! దీన్నిబట్టి శ్రీశ్రీ కవిత్వం ఎలా ఉంటుందని భావిస్తున్నారు?
జవాబు:
శ్రీశ్రీ కవిత్వాన్ని ఎవరూ తూచలేరు. శ్రీశ్రీ కవిత్వం చాలా ఉన్నతమైనది. బరువైన భావాలతో ఉంటుంది. విప్లవాత్మకమైనది. దానిలో పీడితులు, అనాథలు, దోపిడీకి గురౌతున్నవారి బాధలు, కన్నీళ్ళు ఉంటాయి. కర్షక, కార్మిక వీరుల కష్టాలు ఉంటాయి. ప్రపంచంలో దగాపడినవారి గాథలు ఉంటాయి. శ్రామిక వర్గపు పోరాటాలు, బాధలు, కన్నీళ్ళు ఉంటాయి.
ఇవి చేయండి
I. అవగాహన – ప్రతిస్పందన
1. పాఠం ఆధారంగా కింది అంశాలపై మాట్లాడండి.
అ) ఇరవయ్యో శతాబ్దాన్ని స్త్రీల శతాబ్దంగా గుర్తించవచ్చా? చర్చించండి.
జవాబు:
ఇరవయ్యో శతాబ్దాన్ని స్త్రీలు ప్రభావితం చేశారు. అందుచేత ఇరవయ్యో శతాబ్దాన్ని స్త్రీల శతాబ్దంగా గుర్తించవచ్చును.
ప్రపంచ వ్యాప్తంగా ఇరవయ్యో శతాబ్దంలో స్త్రీలు విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక, రాజకీయాది రంగాలలో ప్రధాన పాత్ర వహించారు.
లుక్రేటియా మాట్, ఎలిజిబెత్ కేడీ స్టాండన్ అనే ఇద్దరు మహిళలు కలిసి 1848లో న్యూయార్క్ లో ‘స్త్రీల స్వాతంత్ర్య ప్రకటన’ రూపొందించారు.
1850లో లూసీస్టోన్ అనే మహిళ ‘జాతీయ స్త్రీల హక్కులు’ రూపొందించారు.
భారతదేశంలో రాజారామమోహనరాయ్ ‘సతీసహగమనానికి వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించాడు. మహాత్మాగాంధీ స్త్రీల అక్షరాస్యత, హక్కుల గురించి పోరాడాడు. 20వ శతాబ్దంలో ఎంతోమంది స్త్రీలు ఉపాధ్యాయినులు, నర్సులు, గుమస్తాలు, ఎయిర్ హోస్టెస్టు మొదలైన ఉద్యోగాలలో చేరారు.
మేరీక్యూరీ రేడియం, పొలోనియంలపై పరిశోధనలు చేసింది. ఆమె మొట్టమొదటి నోబెల్ బహుమతిని పొందిన మహిళ. రెండుసార్లు నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్తగా 20వ శతాబ్దపు చరిత్రలో ప్రథమస్థానంలో నిలిచింది.
మార్గరెట్ శాంగర్ కుటుంబ నియంత్రణ ఉద్యమం నడిపింది. స్త్రీలకు కుటుంబ నియంత్రణపై అవగాహన కలిగించింది. స్త్రీ, శిశు సంక్షేమానికి కృషి చేసింది.
భారతదేశాన్ని 15 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన ఇందిరాగాంధీ ప్రపంచంలో 2వ మహిళా . ప్రధాని. తొలి మహిళా ప్రధాని సిరిమావో భండారు నాయకే (శ్రీలంక).
ఈ విధంగా అనేకమంది మహిళామణులు 20వ శతాబ్దాన్ని తమదిగా చేసుకొని చరిత్ర పుటలలో సువర్ణాక్షరాలతో లిఖించబడ్డారు.
ఆ) మహిళా దినోత్సవం సందర్భంగా పాఠశాలలో కింది వాటిలో ఏ అంశంపై ఏమేం మాట్లాడతారు?
1) బాలికా విద్య – ఆవశ్యకత
2) నీకు నచ్చిన మహిళ – గుణగణాలు
3) మహిళల సాధికారత – స్వావలంబన
4) పురుషులతో దీటుగా మహిళల ప్రగతి నిజమేనా?
జవాబు:
1) బాలికా విద్య – ఆవశ్యకత
“ఒక తల్లి విద్యావంతురాలైతే ఆ కుటుంబమంతా విద్య నేర్చుకొంటుంది” అన్నారు విజ్ఞులు.
బాలికలు విద్య నేర్చుకొంటే సమాజానికి చాలా మంచిది. ఎందుకంటే సమాజంలో కుల, మతాలతో పనిలేకుండా వివక్షకు గురయ్యేది స్త్రీ. ఎటువంటి దురాచారానికైనా మొదట బలి అయ్యేది స్త్రీయే. సంసారానికి దిక్సూచి స్త్రీయే. అటువంటి స్త్రీ విద్యావంతురాలైతే ఆమె తనకు జరిగే అన్యాయాన్ని ప్రతిఘటిస్తుంది. తన కుటుంబానికి, తనకు న్యాయం చేసుకొంటుంది. అందుచేత బాలికా విద్య ప్రోత్సహించ తగినది. బాలికా విద్య సంఘ సంస్కరణకు తొలిమెట్టు. “ముదితల్ నేర్వగరాని విద్యగలదే ముద్దార నేర్పించినన్” అన్నట్లుగా స్త్రీలకు విద్య నేర్పితే ఎంతటి ఉన్నత స్థానాలనైనా అధిరోహించ
గలుగుతారు.
2) నీకు నచ్చిన మహిళ – గుణగణాలు
కస్తూరిబా గాంధీ :
11 ఏప్రిల్ 1869లో పోర్బందర్ లో జన్మించింది. గోకుల్ దాస్, విరాజ్ కున్వెర్బా కపాడియా దంపతులకు జన్మించింది. 1882లో మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ (మహాత్మాగాంధీ) తో వివాహమయ్యింది.
1897లో భర్తతో కలసి దక్షిణాఫ్రికాకు వెళ్ళింది. అక్కడ తన భర్తతో అనేక ఉద్యమాలలో పాల్గొంది. జైలుకు వెళ్ళింది. భారతదేశం వచ్చాక, భర్తతో కలసి భారత స్వాతంత్ర్య సమరంలో పాల్గొంది. ఇక్కడ కూడా అనేకసార్లు జైలుకు వెళ్ళింది. ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. విశ్రాంతి తీసుకోమని వైద్యులు చెప్పినా వినలేదు. భరతమాత దాస్యశృంఖలాలను ట్రెంచడానికి తన కృషి మానలేదు. దేశ ప్రజలను చైతన్యవంతులను చేసింది. దేశం కోసం అహర్నిశలూ కృషి చేసింది. క్విట్ ఇండియా ఉద్యమంలో అరెస్టయ్యింది. ఆరోగ్యం ఇంకా క్షీణించింది. గుండె నొప్పి వచ్చింది. అయినా దేశసేవ మానలేదు. విశ్రాంతి తీసుకోలేదు. మాతృదేశ సేవలో చివరి నిమిషం వరకూ గడిపింది. 22-2-1944లో తుదిశ్వాస విడిచింది. భరతమాత ముద్దులపట్టిగా చరిత్రలో లిఖించబడిన నారీమణి కస్తూరిబా గాంధీ.
(సూచన : గ్రంథాలయం నుండి వివరాలు సేకరించి విద్యార్థులు తలొకరి గురించి మాట్లాడాలి.)
3) మహిళల సాధికారత – స్వావలంబన
మహిళలకు సాధికారత చదువు వలన మాత్రమే వస్తుంది. మహిళలకు సాధికారత వచ్చినట్లైతే దేశం పురోగమిస్తుంది. మహిళలకు విద్యా, ఉద్యోగ, ఆస్తి హక్కులను ప్రాథమిక హక్కులలో చేర్చాలి. స్వావలంబన అంటే తమకు తామే అభివృద్ధి చెందడం. తమ కాళ్ళపై తాము నిలబడడం. ప్రభుత్వం స్త్రీలకు విద్యా ప్రోత్సాహకాలు కల్పించాలి. వారి స్వావలంబనకు వడ్డీలు లేని ఋణాలు మంజూరు చేయాలి. ఆర్థికంగా పుంజుకొనే అవకాశం కల్పించాలి. రాజకీయ పదవులలో ఎక్కువగా మహిళలను నిలపాలి. మహిళలకు సాధికారత, స్వావలంబన కల్పిస్తే, ప్రపంచ దేశాలలో భారత్ అగ్రగామి అవుతుంది. అవినీతి అంతమవుతుంది.
4) పురుషులతో దీటుగా మహిళల ప్రగతి నిజమేనా?
పురుషులతో దీటుగా మహిళల ప్రగతి కొంతవరకే నిజం. విద్యారంగంలో మహిళలు, మగవారికి దీటుగానే కాదు, అధిగమించి తమ ఆధిక్యతను చాటుకొంటున్నారు. క్రీడలలో కూడా మగవారితో దీటుగా ఉంటున్నారు. ఉద్యోగాలలో కూడా మగవారికి దీటుగానే ఉంటున్నారు. కాని, ఎంత ప్రగతిని సాధించినా, ఎంత దీటుగా నిలబడినా మగవారి పెత్తనం తప్పదు. ఒక మహిళ పదవిని చేపట్టినా, ఆమె భర్త, అన్న, తండ్రి, కొడుకు ఎవరో ఒకరు పెత్తనం చెలాయిస్తారు. రాజకీయంగా ఒక మహిళ సర్పంచ్ గా ఎన్నికైనా పెత్తనం ఆమెది కాదు. ఆమె ఇంటి మగవారిదే. ఆమె అలంకార ప్రాయంగానే మిగిలిపోతోంది. పల్లెటూళ్ళలో ఇది మరీ ఎక్కువ.
ఈ విధానం మారినపుడే మహిళల ప్రగతి నిజమైన ప్రగతి అవుతుంది. లేకపోతే అదంతా బూటకపు ప్రగతే.
2. ఈ కింది వాక్యాలు పాఠ్యాంశంలో ఎక్కడ వచ్చాయో గుర్తించి వాటి సందర్భాల్ని వివరించండి.
అ) సంప్రదాయ చరిత్రకారులు స్త్రీలను చరిత్రలో అక్కడక్కడా పౌడర్ అద్దినట్లు అద్దుతుంటారు.
జవాబు:
పరిచయం :
ఈ వాక్యం ఓల్గా, వసంత కన్నబిరాన్, కల్పన కన్నబిరాన్లు రచించిన ‘మహిళావరణం’ గ్రంథం ‘ముందుమాట’ నుండి గ్రహింపబడిన “మా ప్రయత్నం” పాఠంలోనిది.
సందర్భం :
ఉద్యమాలు, చరిత్రలలో స్త్రీల పాత్ర గురించి రచయిత్రులు వివరిస్తున్న సందర్భంలోని వాక్యమిది.
భావం:
చరిత్రకారులు స్త్రీలను చరిత్రలో అక్కడక్కడ అలంకారానికి మాత్రమే రాశారు తప్ప, స్త్రీల గురించి పూర్తిగా రాయలేదు.
ఆ) ఊహలకూ, ఆలోచనలకూ లేని పరిమితులు పనిలో ఉన్నాయి.
జవాబు:
పరిచయం :
ఈ వాక్యం ఓల్గా, వసంత కన్నబిరాన్, కల్పన కన్నబిరాన్లు రచించిన ‘మహిళావరణం’ గ్రంథం ‘ముందుమాట’ నుండి గ్రహింపబడిన “మా ప్రయత్నం” పాఠంలోనిది.
సందర్భం :
రచయిత్రులు ‘మహిళావరణం’ పుస్తక రచనలో ఏర్పడిన ఇబ్బందులను వివరిస్తున్న సందర్భంలోని వాక్యమిది.
భావం:
సమాజంలో ప్రతిదాన్నీ మార్చటానికి సమాయత్తమైన స్త్రీల సమూహం ఇచ్చిన ప్రేరణ కలిగించిన ఊహలను, ఆలోచనలను పుస్తక రూపంలోకి తేవడంలో అనేక కారణాలు పరిమితులను ఏర్పరచాయి.
ఇ) శాల్యూట్లన్నీ హీరోలకే, హీరోయిన్లు ఆ తర్వాతే… ఇదీ మన సమాజ విధానం.
జవాబు:
పరిచయం:
ఈ వాక్యం ఓల్గా, వసంత కన్నబిరాన్, కల్పన కన్నబిరాన్లు రచించిన ‘మహిళావరణం’ గ్రంథం ‘ముందుమాట’ నుండి గ్రహింపబడిన “మా ప్రయత్నం” పాఠంలోనిది.
సందర్భం :
రచయిత్రులు షావుకారు జానకి గారిని ఇంటర్వ్యూ చేసినపుడు ఆమె పలికిన వాక్యమిది.
భావం:
సినిమాలలో నటించిన హీరోలకిచ్చిన ప్రాధాన్యం, గౌరవం హీరోయిన్లకివ్వదు సమాజం.
3. కింది గద్యం చదవండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
50వ దశకపు రెండవ భాగం నుంచీ డెబ్బయవ దశాబ్దం వరకూ రచయిత్రులు ఒక వెల్లువలా తెలుగు సాహిత్యాన్ని ముంచెత్తారు. ఆచంట శారదాదేవి, ఇల్లిందల సరస్వతీదేవి, మాలతీ చందూర్, లత, శ్రీదేవి, వాసిరెడ్డి సీతాదేవి, రంగనాయకమ్మ, ద్వివేదుల విశాలాక్షి, యద్దనపూడి సులోచనారాణి, ఆనందారామం , డి. కామేశ్వరి, బీనాదేవి మొదలైన రచయిత్రుల పేర్లు ఇంటింటా వినిపించే పేర్లయ్యాయి. రచయిత్రుల నవలలతో నవలా సాహిత్యానికి తెలుగులో విస్తృతమైన మార్కెట్ ఏర్పడింది. రచయితలు ఆడవారి పేర్లతో తమ రచనలను ప్రచురించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 1980వ దశకం తెలుగు సాహిత్యంలో స్త్రీల దశాబ్దంగా చెప్పవచ్చు. నవలా సాహిత్యంలో అరవయ్యవ దశాబ్దంలో తిరుగులేని స్థానం సంపాదించుకున్న రచయిత్రులు 80వ దశాబ్దంలో కవిత్వంలో, కథలలో తమ ముద్ర వేశారు. అంతవరకు కవిత్వం తమదనుకునే పురుషుల భ్రమలను బద్దలు కొట్టారు. కవిత్వం రాయడమేకాదు – అంతవరకు కవిత్వంలోకి రాని స్త్రీల అణచివేతలోని పలు కోణాలను తమ కవితావస్తువుగా స్వీకరించారు.
అ) తెలుగు సాహిత్యంలో రచయిత్రులు ఏ కాలంలో వెల్లువలా వచ్చారు?
జవాబు:
50వ దశకపు రెండవ భాగం నుంచీ డెబ్బెవ దశాబ్దం వరకూ రచయిత్రులు తెలుగు సాహిత్యంలో వెల్లువలా తెలుగు
సాహిత్యాన్ని ముంచెత్తారు.
ఆ) 80 వ దశకం స్త్రీల దశాబ్దమని ఎలా చెప్పగలవు?
జవాబు:
80వ దశకంలో స్త్రీలు నవలా సాహిత్యంతో బాటు కవిత్వం, కథలలో కూడా తమ ముద్ర వేశారు. స్త్రీల అణచివేతలోని పలుకోణాలను తమ కవితా వస్తువుగా స్వీకరించారు. అంతవరకు కవిత్వం తమదనుకొనే పురుషుల భ్రమలను బద్దలు కొట్టారు. కనుక 80వ దశకం స్త్రీల దశాబ్దమని చెప్పవచ్చును.
ఇ) స్త్రీవాద కవయిత్రులు సాధించిన విజయాలు ఏమిటి?
జవాబు:
‘నీలిమేఘాలు’ రెండవ ఉత్తమ స్త్రీ వాద కవితా సంకలన ప్రచురణ, ఓల్గా రచనలు, అనేకమంది స్త్రీవాద రచయిత్రుల ప్రవేశం మొదలైనవి స్త్రీవాద కవయిత్రులు సాధించిన విజయాలు.
ఈ) స్త్రీవాద సాహిత్యంలో ఏ వస్తువులు ప్రాధాన్యం వహించాయి?
జవాబు:
స్త్రీల శరీర రాజకీయాలు, కుటుంబ అణచివేత ప్రాధాన్యం వహించాయి.
ఉ) పై పేరాకు అర్థవంతమైన శీర్షికను పెట్టండి.
జవాబు:
రచయిత్రులు – కవయిత్రులు, స్త్రీవాదం, స్త్రీల దశాబ్దం.
సూచన : పై మూడింటిలో ఏదైనా శీర్షికగా పెట్టవచ్చును. పై పేరాలో ప్రధినంగా చర్చించిన విషయానికి సరిపోయే విధంగా ఏ శీర్షికమైనా పెట్టవచ్చును. ప్రతి విద్యార్థి వేరు వేరు శీర్షికలు పెట్టేలాగా ప్రోత్సహించాలి)
4. పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
అ) సంపాదకులు మహిళావరణం పుస్తకాన్ని ఎందుకు తీసుకురావాలనుకున్నారు?
జవాబు:
గత శతాబ్దపు చరిత్ర నిర్మాతలుగా స్త్రీలది తిరుగులేని స్థానమని రచయిత్రులకు అనిపించింది. ఐతే దానిని సాధికారికంగా, సోదాహరణంగా నిరూపించటానికి ఎంతో అధ్యయనం అవసరం. ఎంతో సమయం కూడా పడుతుంది. అంతకంటే ముందుగా ఈ శతాబ్దంలో భిన్న రంగాలలో కీలక స్థానాలలో కీలక సమయాలలో పనిచేసి, అక్కడ తమ ముద్ర వేసిన వందమంది స్త్రీల ఫోటోలతో, వారి సమాచారంతో ఒక పుస్తకం తీసుకురావాలని రచయిత్రులు భావించారు. అదే ‘మహిళావరణం’.
ఆ) మహిళావరణం రచయిత్రులు ఏఏ రంగాలకు చెందిన స్త్రీల వివరాలు సేకరించాలనుకున్నారు.
జవాబు:
మొదటిసారి చదువుకొన్న స్త్రీలు, మొదటగా వితంతు వివాహం చేసుకొనే సాహసం చేసిన స్త్రీలు, స్త్రీ విద్య కోసం ఉద్యమించిన స్త్రీలు, ఉద్యమాలలో చేరి జైలుకు వెళ్ళేందుకు తెగించిన స్త్రీలు, నాటకం, సినిమా, రేడియో వంటి రంగాలలోకి తొలిసారి అడుగిడిన స్త్రీలు, మొదటి తరం డాక్టర్లు, శాస్త్రవేత్తలు, సంగీతకారులు, నృత్య కళాకారిణులు, విద్యాధికులు
మొదలైన స్త్రీల వివరాలు సేకరించి మహిళావరణం పుస్తకంలో పొందుపరచాలని రచయిత్రులు భావించారు.
ఇ) మహోన్నతులైన స్త్రీల విశేషాలు సేకరిస్తున్న సందర్భంలో సంపాదకులు పొందిన అనుభూతులు ఏంటి?
జవాబు:
మహోన్నతులైన స్త్రీల విశేషాలు సేకరిస్తున్న సందర్భంలో సంపాదకులు చాలామంది స్త్రీలను కలిశారు. వాళ్ళతో మాట్లాడుతుంటే ఉత్సాహంగా ఉండేవారు. వాళ్ళ అనుభవాలు వింటుంటే వారికి ఉద్వేగం కలిగేది. చరిత్రను వారు సంపాదకుల ముందుపరిచేవారు. సరిదె మాణిక్యాంబ గారు, అప్పుడు తమ కులం వారిని ఆడవద్దన్నారని, తర్వాత అన్ని కులాల వారిని ఆడవచ్చన్నారనీ, వారి వృత్తి, పొలాలు, జీవనం అన్నీ లాగేసుకొన్నారనీ చెప్పినప్పుడు సంపాదకులకు కళ్ళు చెమర్చాయి.
నాటక రంగంలోకి కుటుంబ స్త్రీలు రావాలంటారు. కానీ, తామూ కుటుంబ స్త్రీలమే కదా ! ఏ స్త్రీ అయినా కుటుంబం నుండి కాక, ఎక్కడ నుండి వస్తుందని పావలా శ్యామల గారు కోపంగా అడిగినప్పుడు పితృస్వామ్య వ్యవస్థ స్త్రీలను మర్యాద – అమర్యాద పరిధులలో బంధించి తనకనుకూలంగా మాత్రమే వాళ్ళ కదలికను నియంత్రించే విధానమంతా సంపాదకుల కళ్ళకు కట్టింది.
హీరోలకే శాల్యూట్ లని, హీరోయిన్లు ఆ తర్వాతే, చివరకు మిగిలేది హీరోగారి గొప్పతనమే అని షావుకారు జానకి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పినపుడు సంపాదకులకు చరిత్రను తిరిగి రాయాలనే కోరిక బలంగా కలిగింది.
సంపాదకులు 118 మంది మహోన్నత స్త్రీల సమాచారం సేకరిస్తూ, 118 సందర్భాల కంటే ఎక్కువ సార్లు ఉద్వేగానికి గురి అయ్యారు.
ఈ) మహిళావరణం పుస్తకంలోకి ఎంతో మంది స్త్రీలను తీసుకోవాలని ఉన్నా, కొద్దిమందిని మాత్రమే ఎంపిక చేసుకోవడానికి గల కారణాలు ఏమిటి?
జవాబు:
ఈ శతాబ్దంలో విశేష కృషి చేసి, చరిత్ర నిర్మాతలుగా ప్రసిద్ధికెక్కిన మహోన్నతులైన స్త్రీలను అందరినీ, ‘మహిళావరణం’ పుస్తకంలోకి తీసుకురావాలనుకున్నారు. అన్ని రంగాలలోకీ దృష్టి సారించాలనుకున్నారు. కానీ, ఆర్ధిక పరిస్థితులు సహకరించలేదు. కనీసం రెండు వందల మందినైనా చేర్చాలనుకొన్నారు. వీలుపడక 100 మందిని మాత్రమే చేర్చాలనుకొన్నారు. అయితే, ఆ సంఖ్య వారికి తృప్తినివ్వలేదు. అందుచేత 118 మందిని చేర్చారు.
ఆ 118 మందిని ఎంపిక చేయడం కూడా చాలా కష్టం. ప్రతి రంగంలో తమదంటూ ఒక ముద్రవేసిన వారిని ఎంచుకోవాలి. అంటే ఆ రంగంలో నిష్ణాతులైన వారిని ఎంచుకోవాలి. వారిలో కొందరు మరణించి ఉండవచ్చు. వారి వివరాలు సేకరించాలి. బ్రతికున్నవారితో మాట్లాడాలి. వారి మాటలు, ఫోటోలు రికార్డు చేయాలి. ఇంటర్వ్యూలు చేయాలంటే, మరణించినవారి విషయంలో కుదరదు. పుస్తకంలో విలువైన ఇంటర్వ్యూలకు చోటు చాలదు. అందువల్ల ఇంటర్వ్యూలు తీసుకొని, వేయకపోవడం బాగుండదు. ఇంతా శ్రమపడినా ఆర్థికంగా నిధులు లేవు. అందుచేత క్లుప్తత తప్పదు.
మొత్తం మీద సమయం లేక, ఆర్థిక పరిస్థితి బాగోలేక, ఉత్సాహం ఉన్న కొద్దిమందిని మాత్రమే ఎంపిక చేశారు.
ఉ) మహిళావరణం పుస్తకం ప్రచురణలో సంపాదకులకు సహాయపడిన వారెవరు?
జవాబు:
మహిళావరణం పుస్తకానికి ప్రతి దశలోనూ అనేకమంది తమ సహాయసహకారాలను సంపాదకులకు అందించారు. పుస్తక రూపకల్పనకు సంపాదకులు ఎందరినో సంప్రదించారు.
భరత్ భూషణ్ చాలా ఉత్సాహంగా ఫోటోలు తీశారు. అనారోగ్యాన్ని కూడా లెక్కచేయలేదు. జీవించిలేనివారి ఫోటోలను కూడా ఆయన సేకరించారు. ఆయన తను ఒప్పుకొన్న పనిని సంతృప్తిగా, సంతోషంగా పూర్తి చేశారు.
ఎస్.ఆర్. శంకరన్, అక్కినేని కుటుంబరావు గార్లు సంపాదకుల కంటే సీరియస్ గా ఆలోచించారు. ప్రతి సందర్భంలో సంపాదకులను తరచి, తరచి ప్రశ్నించి, మేము ఎంచుకొన్న వారిని గురించి ఎందుకు ఎంచుకొన్నారనీ, ఎంచుకోని వారిని ఎందుకు విడిచారని ప్రశ్నించారు. చక్కటి సలహాలిచ్చారు. నాగార్జున చక్కటి “గ్లోసరీ” తయారుచేశారు. చేకూరి రామారావు గారు భాషా విషయంలో సంపాదకులకు చక్కటి సలహాలనిచ్చారు. పుస్తకం విషయానికి తగినట్లు అందంగా, గంభీరంగా, హుందాగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దినవారు రాజ్ మోహన్ తేళ్ళ గారు. డిజైన్లో, ఆర్ట్ వర్క్ లో ఒక పరిపూర్ణత సాధించడానికి ఆయన చాలా శ్రమపడ్డారు. అనుకున్న సమయానికి పుస్తకాన్ని అందించడానికి రాజ్ మోహన్ విశేష కృషి చేశారు.
నీనా జాదవ్, కంచ రమాదేవి, భరత్ భూషణ్ తో పాటు వెళ్ళి జీవిత విశేషాలు సేకరించారు. అవి అన్నీ ఒక క్రమ పద్ధతిలో భద్రపరిచారు. పద్మిని, సుజాత, సుబ్బలక్ష్మి ఇంగ్లీషులో పుస్తకాన్ని కంప్యూటరు మీద కంపోజ్ చేశారు. బీనా కూడా చాలా పనుల బాధ్యత తీసుకొని, సంపాదకులకు వెసులుబాటు కల్పించింది.
II. వ్యక్తికరణ-సృజనాత్మకత
1. కింది ప్రశ్నలకు ఆలోచించి ఐదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.
అ) “సామాన్యంగా చరిత్ర నిర్మాతలుగా స్త్రీలకు గుర్తింపు దొరకదు” దీంతో మీరు ఏకీభవిస్తారా? ఎందుకు?
జవాబు:
“సామాన్యంగా చరిత్ర నిర్మాతలుగా స్త్రీలకు గుర్తింపు దొరకదు” అనేదానితో ఏకీభవిస్తాను. ఎందుకంటే –
స్త్రీని సాధారణంగా కుటుంబానికి అంటిపెట్టుకొని ఉండే వ్యక్తిగానే పరిగణిస్తారు. తండ్రి చాటున లేదా భర్త చాటున ఉండి ఉద్యమాలలో వారికి చేదోడు వాదోడుగా ఉన్నట్లుగానే స్త్రీలను చిత్రీకరించారు. చరిత్ర నిర్మాతలుగా పురుషులు కీర్తింపబడతారు. వారి సహాయకులుగా స్త్రీలను చరిత్రలో పేర్కొంటారు. కానీ, స్త్రీలను చరిత్ర నిర్మాతలుగా రాయరు. అక్కడక్కడా కొందరిని పేర్కొన్నా, పెద్దగా పట్టించుకోరు. సమాజం ఏర్పరచిన అడ్డంకులను అధిగమించినా, గుర్తింపు లేదు. తమకోసం, దేశంకోసం, సమూహంగా స్త్రీలు చేసిన పోరాటాలకు చరిత్ర గుర్తింపు నివ్వలేదు. స్త్రీలు పడిన సంఘర్షణలకూ, సాధించిన విజయాలకూ గుర్తింపు దొరకదు. చరిత్రలో వారి ఉనికి తునాతునకలైపోయింది.
మొత్తం సామాజికాభివృద్ధి క్రమంలో విడదీయలేని భాగంగా వారిని చూడకుండా వారి జీవిత కథలను విడిగా చరిత్రలో చూపుతారు. ఇలాంటి స్త్రీలు వేళ్ళమీద లెక్కపెట్టగలిగినంత మంది కూడా మన చరిత్ర పుస్తకాలలో కనిపించరు. ఇప్పటికి 30 సంవత్సరాల నుంచి స్త్రీలకు చరిత్రలో స్థానం లేదు. ఉన్న చరిత్ర స్త్రీల ప్రాతినిధ్యాన్ని ప్రతిబింబించే చరిత్ర కాదనే విమర్శ ఉంది.
స్త్రీ విద్యను ప్రోత్సహించిన పురుషులకు చరిత్రలో స్థానం దక్కింది. కానీ, మొదటిసారి చదువుకున్న సామాన్య స్త్రీలకు చరిత్రలో స్థానం దక్కలేదు. వితంతు వివాహ్లాలకు నడుంకట్టిన పురుషులకు చరిత్రలో పెద్దపీట వేశారు కానీ, మొదటగా వితంతు వివాహం చేసుకొన్న స్త్రీలు చరిత్రలో కనబడరు. అలాగే ప్రతి ఉద్యమంలోనూ స్త్రీలను చరిత్రలో తక్కువగా చూపారు. కనుక “సామాన్యంగా చరిత్ర నిర్మాతలుగా స్త్రీలకు గుర్తింపు దొరకదు” అనే సంపాదకుల అభిప్రాయంతో ఏకీభవిస్తాను.
“సామాన్యంగా చరిత్ర నిర్మాతలుగా స్త్రీలకు గుర్తింపు దొరకదు” అనే దానితో ఏకీభవించను. ఎందుకంటే –
చరిత్రలో ఎవరి గొప్పతనం వారిదే. చరిత్ర నిర్మాతలుగా ఎవరు ఉంటే వారినే పేర్కొంటారు తప్ప చరిత్రకారులకు పక్షపాతం ఉండదు.
చరిత్రలో మహాత్మాగాంధీకి ఎంత స్థానం ఉందో, కస్తూరిబా గాంధీకి కూడా చరిత్ర నిర్మాతగా అంత స్థానం దక్కింది. : కస్తూరిబా గాంధీని చరిత్ర నిర్మాతగా ప్రపంచం గౌరవించింది. ఆమెకు సమున్నత స్థానం ఇచ్చింది.
మదర్ థెరిసా కూడా తన సేవల ద్వారా సేవా రంగంలో అపూర్వమైన చరిత్ర సృష్టించింది. ఆమె తండ్రి పేరు మీద ఈ చరిత్రలో స్థానం సంపాదించలేదు. థెరిస్సాను చరిత్ర నిర్మాతగానే గుర్తించారు. గౌరవించారు. నేటికీ గౌరవిస్తున్నారు.
దానగుణంలో డొక్కా సీతమ్మ గారు (పి.గన్నవరం, తూ! గోదావరి జిల్లా) చరిత్ర నిర్మాతగా ప్రసిద్ధికెక్కారు. బ్రిటిషు ప్రభుత్వం కూడా ఆమెను గౌరవించింది. ఇందిరాగాంధీ కూడా తనకు తానుగానే చరిత్ర నిర్మాతగా ప్రసిద్ధికెక్కింది.
కల్పనా చావ్లా అంతరిక్ష పరిశోధనలలో తనకు తానే సాటి అనిపించుకొని చరిత్ర నిర్మాతగా ప్రసిద్ధి కెక్కింది. శకుంతలాదేవి గణితశాస్త్రంలో చరిత్ర నిర్మాతగా ప్రసిద్ధి కెక్కింది.
వ్యాపార రంగం, సినిమా రంగం, ఉద్యమాలు, విద్య, వైద్యం, ఎందులో చూసినా చరిత్ర నిర్మాతలుగా ప్రసిద్ధి కెక్కిన స్త్రీలు వేళ్ళ మీద లెక్కపెట్టగలిగినవారు కాదు వేలమంది ఉన్నారు.
కనుక “స్త్రీలకు చరిత్ర నిర్మాతలుగా తగిన గుర్తింపు దొరకదు” అనే సంపాదకుల అభిప్రాయంతో నేను ఏకీభవించను.
(సూచన: పై రెండు అభిప్రాయాలలో ఏ ఒక్క దినినైనా గ్రహించవచ్చును. రెండింటిని మాత్రం గ్రహించకూడదు.)
ఆ) రచయిత్రులు సంకలనం చేసిన పుస్తకానికి “మహిళావరణం” అనే పేరు సరిపోయిందని భావిస్తున్నారా? ఎందుకు?
జవాబు:
రచయిత్రులు సంకలనం చేసిన పుస్తకానికి “మహిళావరణం” అనే పేరు సరిపోయిందని భావిస్తున్నాను. ఎందుకంటే ఈ పుస్తకం రచించిన ఓల్గా, వసంత కన్నబిరాన్, కల్పన కన్నబిరాన్, ముగ్గురూ స్త్రీలే. ఈ పుస్తకంలో 118 మంది వివిధ రంగాలకు చెందిన మహోన్నతులైన స్త్రీలనే పేర్కొన్నారు. స్త్రీలు నడిపిన ఉద్యమాలు, స్త్రీల కొరకు స్త్రీలు చేసిన పోరాటాలు పేర్కొన్నారు. కనుక దీనికి “మహిళావరణం” అనే పేరు సరిపోయిందని భావిస్తున్నాను.
రచయిత్రులు సంకలనం చేసిన పుస్తకానికి, “మహిళావరణం” అనే పేరు సరిపోలేదు అని భావిస్తున్నాను ఎందుకంటేకేవలం మహిళల వలన కానీ, కేవలం పురుషుల వలన కానీ ఏ ఉద్యమాలూ నడవవు. నడిచినా విజయాన్ని సాధించలేవు. సమస్య మహిళలదైనా, పురుషులదైనా అందరూ కలసి ఉద్యమం చేస్తేనే విజయవంతమౌతుంది. ఈ పుస్తకంలో పేర్కొన్న ప్రతి ఉద్యమంలోనూ మహిళలతోపాటు పురుషులు కూడా పాల్గొనే ఉంటారు. అంతెందుకు ? ఈ పుస్తకం రాయాలనే ఆలోచన వచ్చిన దగ్గర నుండి పుస్తకం ప్రచురణ పూర్తయి చేతిలోకి వచ్చే వరకూ ఎంతమంది స్త్రీల, పురుషుల కష్టం ఉందో సంపాదకులే స్వయంగా రాశారు. కనుక ఈ పుస్తకానికి మహిళావరణం కాక వేరే పేరు పెట్టి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం.
సూచన: పై అభిప్రాయాలు రెండూ పంచకూడదు. ఏ ఒక్క దినినైనా గ్రహించవచ్చును.)
ఇ) “ప్రతివాళ్ళూ ప్రశ్నించారు చరిత్ర సాగిన క్రమాన్నీ !” అని స్త్రీల గురించి రచయిత్రులు ఎందుకు పేర్కొన్నారు?
జవాబు:
అప్పుడు తమ కులంవారిని ఆడవద్దన్నారనీ, తర్వాత అన్ని కులాల వారిని ఆడమన్నారనీ సరిదె మాణిక్యాంబ గారు చెప్పారు. వారి వృత్తి, పొలాలు, జీవనం అన్నీ తీసేసుకున్నారని ఆమె చెప్పారు. ఇప్పుడు అదే జీవనోపాధిగా అన్ని కులాల వాళ్ళు బతుకుతున్నారు. అది తప్పు కాదా ? అని ఆమె ప్రశ్నించారు.
నాటక రంగంలోకి కుటుంబ స్త్రీలు రావాలంటారు. తామంతా కుటుంబ స్త్రీలం కామా ? ఏ స్త్రీయైనా కుటుంబంలోంచి కాకుండా ఎక్కడ నుండి వస్తుంది ? అని పితృస్వామ్య వ్యవస్థని నిలదీశారు పావలా శ్యామల గారు.
శాల్యూట్లన్నీ హీరోలకేనా ? హీరోయిన్లు పట్టరా ? హీరో గొప్పతనం ఉంటే సినిమాలు ఆడేస్తాయా ? అని షావుకారు జానకిగారు సినీ రంగంలోని పురుషాధిక్యతను ప్రశ్నించారు.
ఈ రకంగా ప్రతివాళ్ళు స్త్రీలను తక్కువగా చూసినందుకు చరిత్రను కడిగి పారేశారు. అందుచేతనే “ప్రతివాళ్ళూ ప్రశ్నించారు చరిత్ర సాగిన క్రమాన్నీ” అని రచయిత్రులు పేర్కొన్నారు. వారి ఆవేశంలో అర్థముంది. వారి ప్రశ్నలో పరమార్ధముంది. వారు ప్రశ్నించిన తీరులో అంతరార్థముంది.
2. కింది ప్రశ్నలకు ఆలోచించి పదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.
అ) చరిత్ర నిర్మాతలుగా స్త్రీలు ప్రధానంగా ఉన్నారనే భావన సంపాదకులకు కలగడానికి గల కారణాలను వివరించండి.
(లేదా)
చరిత్ర నిర్మాతలుగా స్త్రీలు ప్రధానంగా ఉన్నారనే భావన సంపాదకులకు కలగడానికి గల కారణాలను “మా ప్రయత్నం” పాఠం ఆధారంగా వివరించండి.
జవాబు:
సామాజికంగా 20వ శతాబ్దంలో స్త్రీలు చాలా పెద్ద మార్పులు తెచ్చారు. నిజానికి ఈ శతాబ్దం స్త్రీలది అని చెప్పవచ్చును. అన్ని రంగాలలో స్త్రీలు చరిత్ర నిర్మాతలుగా ఉన్నారు. ప్రతి రంగంలో స్త్రీలు తమదంటూ ఒక ముద్రను వేశారు.
కొందరైతే చరిత్ర సాగిన క్రమాన్ని ప్రశ్నించారు. సరిదె మాణిక్యాంబ గారు తమ కులం వారిని ఆడవద్దన్నందుకు ఆవేదన చెందారు. తర్వాత అన్ని కులాల వాళ్ళూ ఆడలేదా ? అని తీవ్రంగా ప్రశ్నించారు. నాటక రంగంలో తమను చిన్న చూపు చూసినందుకు పావలా శ్యామల గారు ఊరుకోలేదు. పితృస్వామ్య వ్యవస్థపై ధ్వజమెత్తారు. శాల్యూట్లన్నీ హీరోలకేనా? అంటూ షావుకారు జానకిగారు సినీ పరిశ్రమని కడిగి పారేశారు. ఈ విధంగా చరిత్ర నిర్మాతలుగా స్త్రీలు చరిత్రను ప్రశ్నించారు.
ఆయా రంగాలలో స్త్రీలు చేసిన కృషి, వాళ్ళు వేసిన ముద్ర, మొట్టమొదటిగా ఒక ప్రత్యేక రంగంలో అడుగుపెట్టినప్పుడు వాళ్ళు ఎదుర్కొన్న సంక్లిష్ట సందర్భాలు, ప్రజలలో వారికున్న స్థానం, వీటిని . అన్నిటినీ పరిగణనలోకి తీసుకొంటే చరిత్ర నిర్మాతలుగా స్త్రీలు ప్రధానంగా ఉన్నారు.
సమాజంలోని ప్రతిదాన్నీ మార్చటానికి స్త్రీలు చరిత్రలో సమాయత్తమయ్యారు. దేశంకోసం, తమకోసం, సంఘసంస్కరణ కోసం ఎన్నో పోరాటాలు చేశారు. తాము ముందు వరుసలో ఉండి ఎన్నో ఉద్యమాలు నడిపారు. ఎందరినో ప్రభావితులను చేశారు. స్త్రీలు రాణించిన రంగాలు ఎన్నో ఉన్నాయి.
మొదట చదువుకొన్న స్త్రీ, మొదట వితంతు వివాహం చేసుకొన్న స్త్రీలే నిజమైన చరిత్ర నిర్మాతలు. ఉద్యమాలలో చేరి జైలుకు వెళ్ళిన స్త్రీలు నిజమైన చరిత్ర నిర్మాతలు. నాటకం, సినిమా, రేడియో వంటి రంగాలలోకి మొదటిసారి అడుగుపెట్టిన స్త్రీలు నిజమైన చరిత్ర నిర్మాతలు.
అందువల్లనే చరిత్ర నిర్మాతలుగా స్త్రీలు ప్రధానంగా ఉన్నారనే భావన సంపాదకులకు కలిగింది.
ఆ) “ఈ స్త్రీలందరూ ఈ చరిత్రను నిర్మించేందుకు ఎంత మూల్యం చెల్లించారో తలచుకుంటే మా గుండెలు బరువెక్కాయి” అనడంలో పీఠికాకర్తల ఆంతర్యం ఏమిటి?
జవాబు:
చరిత్రకారులు స్త్రీలకు తగిన గుర్తింపు నివ్వలేదు. పితృస్వామ్య వ్యవస్థ, పురుషాధిక్యత స్త్రీలను తక్కువగానే చూసింది. అయినా స్త్రీలు వెనుకంజ వేయలేదు. స్త్రీల ఉద్యమాలు ఈ విషయాన్ని ప్రశ్నించాయి. విలువా, గుర్తింపూ లేకపోయినా స్త్రీలు దేశం కోసం, తమ కోసం ఉద్యమాలు చేశారు. ఎంతోమంది స్త్రీలు సమాజపు కట్టుబాట్లను ప్రశ్నించారు. సమాజాన్ని ఎదిరించి విద్యాభ్యాసం చేశారు. వితంతువులు పునర్వివాహాలు చేసుకొన్నారు. ఉద్యమాలలో తెగించి పాల్గొన్నారు. జైళ్ళకు :. వెళ్లడానికి కూడా భయపడలేదు. నాటకం, సినిమా, రేడియో వంటి రంగాలలోకి మొదటిసారి అడుగుపెట్టిన స్త్రీలకు వారి కుటుంబాల నుండీ, సమాజం నుండీ ఎన్ని ఆటంకాలు ఎదురయ్యాయో ఊహించుకొంటేనే భయం వేస్తుంది. మొదటి తరం డాక్టర్లు, లాయర్లు, శాస్త్రవేత్తలు, సంగీతకారులు, నృత్య కళాకారిణులు మొదలైన వారంతా ఎన్నో బాధలు పడి ఉంటారు. ఎన్నో ఈసడింపులకు గురై ఉంటారు. ఎన్నెన్నో అవమానాలను ఎదుర్కొని ఉంటారు. ఇంకెన్నో సూటిపోటి మాటలను ధరించి ఉంటారు. ఎంతో ఆవేదన చెంది ఉంటారు. ఎన్నో కోల్పోయి ఉంటారు.
అయినా ధైర్యం కోల్పోలేదు. పట్టుదల వీడలేదు. సంస్కరణలను వదిలి పెట్టలేదు. ఉద్యమాలు ఆపలేదు. తమ కోసం, దేశం కోసం పరితపిస్తున్నారు. ఉద్యమిస్తున్నారు. ఉద్యమాలే ఊపిరిగా స్త్రీలు చేసిన సాహసాలు తలుచుకొంటే ఒళ్ళు పులకరిస్తుంది. వారు పడిన బాధలు ఊహించుకొంటే హృదయం ద్రవిస్తుంది.
అటువంటి చరిత్ర నిర్మాతలైన స్త్రీల బాధలను, అనుభూతులను వారి మాటలలోనే సంపాదకులు విన్నారు. సరిదె మాణిక్యాంబ గారు తమ కులం వారిని ఆడవద్దన్నపుడు ఆమెకు కలిగిన ఆవేదన, తర్వాత అన్ని కులాల వారూ ఆడినపుడెవరూ అభ్యంతరం చెప్పకపోవడంతో రెట్టింపయింది. షావుకారు జానకిగారు ఎంత గొప్ప నటి అయినా హీరోలకే గౌరవాలు దక్కినపుడు ఆమె వేదన వర్ణనాతీతం. నాటక రంగంలో తమను తక్కువ చూపు చూసినందుకు పావలా శ్యామల గారి బాధను చెప్పడానికి మాటలు చాలవు.
అప్పటి కందుకూరి రాజ్యలక్ష్మి గారు వితంతు పునర్వివాహాల కోసం ఉద్యమించారు. స్త్రీ విద్యకోసం తపించారు. ఆమె నుండి మేకప్ రంగంలో స్త్రీలకు స్థానం కోసం పోరాడిన శోభాలత వరకూ అందరూ కొత్త వెలుగుల కోసం తాపత్రయపడిన వారే. అందరూ ఎంతో కొంత మూల్యం చెల్లించినవారే. అందుకే అవన్నీ స్వయంగా పరిశీలించిన సంపాదకుల హృదయాలు బాధతో బరువెక్కాయి. వారి మాటలలోని ఆంతర్యం అదే.
3. కింది అంశాల గురించి సృజనాత్మకంగా ప్రశంసిస్తూ రాయండి.
అ) ఒక ప్రముఖ స్త్రీవాద రచయిత్రి మీ పాఠశాల వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొనడానికి వస్తున్నారు. వారిని మీరు ఏమి ప్రశ్నించదలచుకున్నారో ఆ ప్రశ్నల జాబితా రాయండి.
జవాబు:
నమస్కారాలండీ, మా పాఠశాల వార్షికోత్సవానికి మీకు స్వాగతం పలుకుతున్నాం. మీ వంటి పెద్దవారు మా పాఠశాలకు రావడం మాకు చాలా ఆనందంగా ఉందండీ. మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడిగి, మా సందేహాలు తీర్చుకోవాలని, విద్యార్థులందరం కలిసి ఒక జాబితా రూపొందించాం. ఇవండీ ఆ ప్రశ్నలు –
ప్రశ్నల జాబితా:
- మీ పేరు మా అందరికీ తెలుసు. అయినా మీ నోటితో మీ పేరు వినాలని మా కుతూహలం. మీ పేరు చెప్పండి.
- మీదే ఊరండీ?
- మీ చిన్నతనంలో మీరే స్కూలులో చదివారు?
- అది ప్రభుత్వ పాఠశాలా? ప్రైవేటుదా?
- మీ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మీపై కోప్పడేవారా?
- మీరు అల్లరి చేసేవారా?
- ఎవరితోనైనా ఫైటింగులు చేసేవారా?
- మీరు ఎక్కడి వరకూ చదివారు? మీ విద్యావిశేషాలు చెప్పండి.
- స్త్రీవాద రచయిత్రిగా మీరు మారడానికి కారణాలేమిటి?
- మీరు స్త్రీవాద రచయిత్రిగా స్త్రీలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలకు ఏ విధమైన పరిష్కారాలు చెబుతారు?
- స్త్రీవాద రచయిత్రుల వలన సమాజానికేమిటి ఉపయోగం?
- మీ రచనల పేర్లు చెప్పండి. వాటిలోని విషయాలు కూడా సంక్షిప్తంగా చెప్పండి.
- మీ భర్త గారూ, పిల్లలూ మిమ్మల్ని స్త్రీవాద విషయంలో ప్రోత్సహిస్తారా?
- ఇప్పుడు కూడా ఇంట్లో మగవారి మాటే చెల్లుతుంది కదా ! దీనిపై మీ అభిప్రాయం చెప్పండి.
- మీరు మాకిచ్చే సందేశం చెప్పండి.
- మీకు నచ్చిన, మీరు మెచ్చిన స్త్రీవాద రచయిత్రులెవరు? ఎందుకు?
- మీరు మగవారి రచనలు చదువుతారా? చదవరా?
- మీ వంటి రచయిత్రి మా పాఠశాలకు వచ్చి, మా సందేహాలు తీర్చినందుకు ధన్యవాదాలండీ. నమస్కారమండీ.
ఆ) మహిళల పట్ల చూపుతున్న వివక్షలను, వారి మీద జరుగుతున్న దాడులను ఖండిస్తూ, మహిళలందరూ ధైర్యంతో మెలగాలని తెలియజేసేలా ఒక కరపత్రం తయారుచేయండి.
జవాబు:
(మహిళలే మహిని వేల్పులు )
మనలను తన కడుపులో పెట్టుకొని, నవమాసాలు మోసి, కని, పెంచిన అమ్మ ఒక స్త్రీ. ప్రతి స్త్రీలోనూ అమ్మనే చూడాలని రామకృష్ణ పరమహంస ఉద్బోధించారు. ఉపనిషత్తులు ‘మాతృదేవోభవ’ అని తల్లికి మొదటి స్థానం ఇచ్చి దైవంగా పూజించమన్నాయి. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, మొత్తం ప్రపంచంలోని ఏ భాషకు చెందిన సాహిత్యమైనా స్త్రీని గౌరవించమని బోధించింది. కానీ, స్త్రీని చిన్నచూపు చూడమని ఏ సాహిత్యమూ చెప్పలేదు. చెప్పకూడదు. చెప్పదు.
స్త్రీలను చిన్నచూపు చూడడం, ఆడపిల్ల కదా అని వివక్షతతో మాట్లాడడం కుసంస్కారానికి నిదర్శనం. ఆడపిల్లలకు చురుకుతనం ఎక్కువ ఉంటుంది. సహజసిద్ధంగానే తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. ఓర్పు ఎక్కువ. నేర్పు ఎక్కువ. అటువంటి బాలికలను ప్రోత్సహించాలి. చదవించండి. వివక్షతకు గురి చేయకండి.
ఇప్పటి సినిమాల ప్రభావమో ఏమోకాని, స్త్రీలపై దాడులు పెరిగిపోతున్నాయి. ఇది మన సమాజానికి సిగ్గుచేటు. ప్రపంచానికి ‘గీత’ ను బోధించిన భారతీయులు ‘గీత’ను దాటడం తగదు. ఎక్కడైనా స్త్రీలకు అన్యాయం జరుగుతుంటే తిరగబడండి. శత్రుదేశపు స్త్రీని కూడా తల్లిలాగ భావించిన శివాజీ మనకు ఆదర్శం. స్త్రీని దేవతగా భావిద్దాం . తల్లిగా, సోదరిగా గౌరవిద్దాం. మన సంస్కారాన్ని ప్రపంచమంతా చాటిద్దాం. ఎక్కడ స్త్రీలు ఆనందంగా ఉంటారో అక్కడ దేవతలు ఆనంద తాండవం చేస్తారు.
రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, జోన్ ఆఫ్ ఆర్క్, చాంద్ బీబీ వంటి వీరనారులు ఉద్భవించిన ఈ భూమిమీద పుట్టిన నీవు అబలవా ! సబలవా ! నిన్ను నీవు నిరూపించుకో! నువ్వు వేసే ప్రతి అడుగూ కావాలి దుర్మార్తులకు దడుపు. నిన్ను నువ్వే కాపాడుకో! తెగించు ! పోరాడు ! మేమున్నాం భయపడకు! నారీలోకపు విజయ పతాకం చేబూను! అందుకో ! జయజయ ధ్వానాలు.
భాషా కార్యకలాపాలు ప్రాజెక్టు పని
వివిధ రంగాలలో ప్రసిద్ధులైన మహిళల ఫోటోలను, జీవిత విశేషాలను సేకరించి, ఒక మోడల్ “మహిళావరణం”
పుస్తకాన్ని తయారుచేయండి. ప్రదర్శించండి.
జవాబు:
1. సుసన్నా అరుంధతీరాయ్ (రచయిత్రి – సంఘసంస్కర్త) :
మొట్టమొదటిసారిగా తన రచన ‘ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనే పుస్తకానికి 1997 లో ‘బ్రిటన్ వారిచ్చే ‘బుకర్ ప్రైజ్’ ను గెలుచుకున్న భారతీయ మహిళ. 1961 నవంబరు 25న బెంగాల్ లో జన్మించి కేరళ, కొట్టాయంలోని ‘అయ్ మానమ్’ గ్రామంలో పెరిగింది. ‘ఆమె చాలామందికి స్ఫూర్తి ప్రదాత. చిన్నతనం నుండి బాలికగా, స్త్రీగా ఎన్నో ఇబ్బందులను, అడ్డంకులను అధిగమించి ఈ స్థాయికి చేరింది. పేదలు, అణగారిన వర్గాల తరఫున గొంతెత్తి ‘అధికారం’ తో మాట్లాడాలంటే ఈమెకి ఈమే సాటి. 2004లో ఈమె సిడ్నీ అరుందరాయ్) శాంతి బహుమతిని కూడా గెలుచుకుంది.
2. శకుంతలాదేవి :
మానవ కంప్యూటర్ – గణితంలో ఎంత కష్టమైన సమస్యనైనా ఎటువంటి యంత్ర సహాయం లేకుండానే సాధించగలిగే అసమాన ప్రతిభ కలిగిన స్త్రీ. 1939 లో కర్ణాటకలోని బెంగళూరులో జన్మించింది. చాలా దేశాలు ఈవిడ ప్రతిభను ప్రదర్శించడానికి తమ దేశాలకు ఆహ్వానించాయి. 1995లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఈమె పేరును 26వ పేజీలో లిఖించారు.
3. అనిబిసెంట్ :
లండన్లో జన్మించిన ఐరిష్ మహిళ. 1893 వ సం||లో భారతదేశానికి వచ్చారు. ఈమె ప్రఖ్యాతిగాంచిన విద్యావేత్త, జర్నలిస్టు, సోషల్ వర్కర్, మరియు ఆధ్యాత్మికవేత్త. ఈమె థియోసాఫికల్ సొసైటీ (దివ్యజ్ఞాన సమాజం) ను స్థాపించారు. భారతదేశంలో స్వాతంత్ర్యపోరాట కాలంలో హోమ్ రూల్ లీగ్ ను ప్రారంభించారు. అంతేగాక, న్యూ ఇండియా’ కు సంపాదకత్వం వహించారు. భారతీయ బాలుర స్కౌట్ అసోసియేషను కూడా ప్రారంభించారు. 86 సం||ల వయస్సులో ఈమె మరణించారు.
4. కరణం మల్లేశ్వరి :
భారతదేశ వెయిట్ లిఫ్టర్. ఒలింపిక్స్ లో భారతదేశం తరఫున మెడల్ సాధించిన తొలి మహిళ. 2000 సం||రం సిడ్నీ ఒలింపిక్స్ లో ఈమె పతకాన్ని సాధించింది. 1994 – 95 సం||రానికి రాజీవ్ ఖేల్ రత్న అవార్డును పొందింది. మహిళ అయివుండి పురుషులు ఎక్కువగా పాల్గొనే వెయిట్ లిఫ్టింగ్ లో ఒలింపిక్ పతకం గెలవడమంటే ఎన్ని కష్టనష్టాలకు ఓర్చి ఉంటుందో ఊహించండి.
5. ఎం.ఎస్.సుబ్బులక్ష్మి :
మధురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి 1916 సెప్టెంబరు 16న మధురైలో జన్మించారు. కర్ణాటక సంగీతంలో నైటింగేలని అంటారు. ఈమె 1954లో ‘పద్మభూషణ్’, 1974లో రామన్ మెగసెసె అవార్డు, 1975లో ‘పద్మ విభూషణ్’ లతో గౌరవించబడ్డారు. 1998లో ‘భారతరత్న’ అవార్డును కూడా పొందారు. మహిళలు అంతగా బయటకి రాని రోజుల్లోనే ఆమె సంగీత కచేరీలు చేశారు. 88 సం|| రాల వయసులో ఈమె మరణించారు.
6. ఇందిరాగాంధీ :
మొట్టమొదటి మహిళా ప్రధాని, అలహాబాదులో జన్మించారు. 13 సంవత్సరాల వయసులోనే ‘వానరసేన’ ను స్థాపించి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన ధీరురాలు. ఆమె ప్రధానమంత్రిగా ఉన్నపుడు బ్యాంకుల జాతీయీకరణ, బంగ్లాదేశ్ కు స్వేచ్ఛ, 20 పాయింట్ ప్రోగామ్ మొదలైనవి అమలుచేశారు. ఆమె భారతరత్న పురస్కారాన్ని 1971లో పొందారు. 1984 అక్టోబరు 31న ఇందిరాగాంధీ తన సొంత గార్డులచే కాల్చి చంపబడ్డారు. ఈమె తన రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచిన మహిళ.
7. కల్పనాచావ్లా :
జననం 1 – 7 – 1961, మరణం 1 – 2 – 2003. ఇండియన్ అమెరికన్ వ్యోమగామి. కొలంబియా స్పేస్ షటిల్ లో మరణించిన ఏడుగురు వ్యోమగాములలో ఈమె కూడా ఒకరు. ఈమెకు నాసా అనేక మెడల్స్ ఇచ్చింది. మరణం తథ్యమని తెలిసినా కూడా స్పేస్ షటిల్ లో ఆమె ప్రవర్తన, ధైర్యం చిరస్మరణీయం.
8. మేథాపాట్కర్ :
ఈమె 1954 డిసెంబరు 1న జన్మించారు. సామాజికవేత్త. ప్రముఖ పర్యావరణవేత్త, ముంబై వాసి. ‘నర్మదా బచావో’ ఆందోళనలో పాలుపంచుకుంటున్నారు. 1991లో రైట్ లైవ్లీహుడ్ అవార్డును పొందారు.
9. తస్లీమా నస్క్రీన్ :
ఈమె 1962 ఆగస్టు 25న బంగ్లాదేశ్ లో జన్మించారు. ప్రముఖ ఫెమినిస్టు. మతాలకతీతంగా స్త్రీకి స్వేచ్ఛ, సమానత్వాలు ఉండాలని ‘అక్షర యుద్ధం’ చేస్తున్నారు. ఈమె వ్రాసిన ‘లజ్జ’ అనే పుస్తకం బాగా ప్రాచుర్యం పొందింది. దీని మూలంగా ఆమె అనేక దాడులకు గురయింది. ఆమె ప్రస్తుతం బంగ్లాదేశ్ ను వదిలిపెట్టి ప్రవాసంలో జీవితాన్ని గుడుపుతున్నారు.
10. కిరణ్ బేడి :
ఈమె 1949 జూన్ 9న జన్మించారు. విశ్రాంత ఐ.పి.ఎస్ ఆఫీసరు. మొట్టమొదటి మహిళా ఆఫీసరు. 1994లో రామన్ మెగసెసె అవార్డు గ్రహీత. పంజాబ్ రాష్ట్రంలోని అమృత్ సర్ లో జన్మించారు. తన విధి నిర్వహణలో అనేక ఇబ్బందులు, ఒడిదుడుకులు ఎదుర్కొన్న మహిళ.
III. భాషాంశాలు
పదజాలం
1) కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు పర్యాయపదాలు రాయండి.
అ) సామాన్యంగా చరిత్ర నిర్మాతలుగా స్త్రీలకు గుర్తింపు దొరకదు.
జవాబు:
స్త్రీ : 1) పడతి 2) వనిత 3) ముదిత
ఆ) అందరికీ ఒక పద్ధతి పాటించడమే బాగుంటుంది.
జవాబు:
పద్దతి : 1) విధానం 2) కరణి 3) చందము
ఇ) ఎన్నో అనుభవాలు స్మరణలోకి తెచ్చుకున్నాను.
జవాబు:
స్మరణ : 1) జ్ఞప్తి 2) గుర్తు 3) తలపు
2) ఈ పాఠంలో శబ్దాలంకారం ఉన్న వాక్యాలను గుర్తించి రాయండి.
జవాబు:
1) కొత్త సహస్రాబ్దంలోకీ, శతాబ్దంలోకి అడుగుపెడుతున్న సందర్భంలో గడిచిన
3) పాఠం ఆధారంగా కింది జాతీయాలు ఏ సందర్భాలలో వాడతారో వివరించండి.
అ) గుండెలు బరువెక్కడం :
జవాబు:
విపరీతమైన మానసిక బాధ కలిగినపుడు ఈ జాతీయం ఉపయోగిస్తారు.
సొంతవాక్యం : పేదల పాట్లు చూస్తే, ఎవరికైనా గుండెలు బరువెక్కడం సహజం.
ఆ) నీరు కారిపోవడం :
జవాబు:
పాడైపోవడం, నిరుత్సాహపడడం, ఆశలన్నీ అడుగంటిపోవడం వంటి సందర్భాలలో ఈ జాతీయం ఉపయోగిస్తారు.
సొంతవాక్యం :
కురుక్షేత్రంలో అర్జునుడు నీరు కారిపోవడం చూసి, కృష్ణుడు గీతోపదేశం చేశాడు.
ఇ) కనువిప్పు :
జవాబు:
‘జ్ఞానం’ కలగడం అనే సందర్భంలో ఈ జాతీయం ఉపయోగిస్తారు.
సొంతవాక్యం :
గీతోపదేశంతో అర్జునుడికి కనువిప్పు కలిగింది.
ఈ) కాలధర్మం చెందడం :
జవాబు:
కాల ప్రవాహంలో ఏదైనా నశింపక తప్పదు. అలాగే ‘మరణించడం’ అనే సందర్భంలో ఈ జాతీయం ఉపయోగిస్తారు. .
సొంతవాక్యం :
ఎంతోమంది రోడ్డు ప్రమాదాలలో కాలధర్మం చెందడం రోజూ జరుగుతోంది.
ఉ) తునాతునకలు :
జవాబు:
ముక్కముక్కలవడం, పూర్తిగా దెబ్బతినడం అనే సందర్భాలలో ఈ జాతీయం ఉపయోగిస్తారు.
సొంతవాక్యం :
ఈ మధ్య రోడ్డు ప్రమాదాలలో చాలా బస్సులు తునాతునకలయ్యాయి.
4) కింది పదాలను గురించి వివరించండి.
అ) సామాజిక మార్పు :
జవాబు:
సమాజంలో ఈ రోజు ఉన్న ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, ధర్మాలు తర్వాత మారిపోవచ్చును. ఇలా సమాజంలో కలిగే మార్పును సామాజిక మార్పు అంటారు.
సొంతవాక్యం :
సామాజిక మార్పు వలన బాల్యవివాహాలు తగ్గాయి.
ఆ) విజయోత్సవం :
జవాబు:
విజయం లభించినందుకు చేసుకొనే పండుగ.
సొంతవాక్యం :
ఎన్నికలలో నెగ్గినవారు విజయోత్సవాలు చేసుకొన్నారు.
ఇ) సామాజికాభివృద్ధి :
జవాబు:
సమాజపరమైన అభివృద్ధి.
సొంతవాక్యం :
విద్య సామాజికాభివృద్ధికి దోహదం చేస్తుంది.
ఈ) సాంస్కృతిక వారసత్వం :
జవాబు:
సంస్కృతి అంటే ఒక సమాజపు ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, వినోదాలు మొ||నవి. సాంస్కృతికము అంటే సంస్కృతికి సంబంధించింది. సాంస్కృతిక వారసత్వం అంటే సంస్కృతికి సంబంధించిన వాటి కొనసాగింపు.
సొంతవాక్యం :
మన భారతీయ సాంస్కృతిక వారసత్వం కుటుంబ వ్యవస్థ.
ఉ) అగ్రతాంబూలం :
జవాబు:
ఒక రంగానికి చెందిన లేదా ఒక గ్రామానికి లేదా ఒక సమాజానికి చెందిన వారిలో ఉన్నతునిగా గుర్తించడం.
సొంతవాక్యం :
కవులలో కాళిదాసుదే అగ్రతాంబూలం.
వ్యాకరణాంశాలు
1. కింది వాక్యాలు ఏ రకమైన వాక్యాలో గుర్తించి రాయండి.
ఉదా : మీరు రావద్దు నిషేధార్థక వాక్యం
అ) దయచేసి నన్ను కాపాడు. – ప్రార్ధనార్థక వాక్యం
ఆ) మీరు రావచ్చు. – అనుమత్యర్థక వాక్యం
ఇ) వారందరికి ఏమైంది? – ప్రశ్నార్థక వాక్యం
ఈ) నేను తప్పక వస్తాను. – నిశ్చయార్థక వాక్యం
ఉ) ఆహా ! ఎంత బాగుంది ! – ఆశ్చర్యార్థక వాక్యం
ఊ) వారు వెళ్ళవచ్చా? – సందేహార్థక వాక్యం
2. కింద ఇచ్చిన సంధులు – పదాల మధ్య సంబంధాన్ని గుర్తించి వాటిని జతచేసి, సూత్రాలు రాయండి.
3. కింద ఇచ్చిన సమాసాలు – పదాలు వేటికి ఏవి వర్తిస్తాయో గుర్తించి, ఆయా పదాలకు సంబంధించిన సమాసాలను, విగ్రహవాక్యాలు రాయండి.
సమాసం పేరు | సమాస పదం |
తృతీయా తత్పురుష సమాసం | వితంతు వివాహం |
సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం | విద్యాధికులు |
షష్ఠీ తత్పురుష సమాసం | గంగానది |
ద్విగు సమాసం | ముప్పయి సంవత్సరాలు |
ద్వంద్వ సమాసం | స్త్రీ పురుషులు భారతదేశం |
సమాస పదం | విగ్రహవాక్యం | సమాసం పేరు |
1) వితంతు వివాహం | వితంతువు యొక్క వివాహం | షష్ఠీ తత్పురుష సమాసం |
2) విద్యా ధికులు | విద్యచేత అధికులు | తృతీయా తత్పురుష సమాసం |
3) గంగానది | గంగ అను పేరు గల నది | సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం |
4) ముప్పయి సంవత్సరాలు | ముప్పయి అయిన సంవత్సరాలు | ద్విగు సమాసం |
5) స్త్రీపురుషులు | స్త్రీలును, పురుషులును | ద్వంద్వ సమాసం |
6) భారతదేశం | భారత్ అనే పేరు గల దేశము | సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం |
4. కింది ఉదాహరణలు ఏయే అలంకారాలకు చెందినవో గుర్తించండి. సమన్వయం రాయండి.
అ) సుదతీ నూతన మదనా!
మదనాగతురంగ పూర్ణమణిమయసదనా!
సదనామయ గజ రదనా!
రదనాగేంద్ర నిభకీర్తి రస నరసింహా!
జవాబు:
ఈ పద్యంలో ‘ముక్తపదగ్రస్తము’ అనే అలంకారం ఉంది.
వివరణ :
పై పద్యంలోని మొదటి పాదం ‘మదనా’ తో పూర్తయింది. రెండవ పాదం ‘మదనా’ తో మొదలయింది. ఆ ‘సదనా’తో పూర్తయింది. మూడవ పాదం ‘సదనా’ తో ప్రారంభమయింది. ‘రదనా’ తో పూర్తయింది. నాలుగవ పాదం ‘రదనా’ తోనే ప్రారంభమయింది. సమన్వయం : మొదటి పాదం చివరి పదంతో రెండవ పాదం, రెండవ పాదం చివరి పదంతో మూడవ పాదం, మూడవ పాదం చివరి పదంతో నాల్గవ పాదం ప్రారంభమయ్యాయి. విడిచిన (ముక్త) పదాన్నే మళ్ళీ గ్రహించారు కనుక పై పద్యంలో ముక్తపదగ్రస్తాలంకారం ఉంది.
ఆ) మానవా! నీ ప్రయత్నం మానవా?
జవాబు:
దీనిలో యమకాలంకారం ఉంది.
వివరణ :
ఒకే పదం అర్థభేదంతో ప్రయోగిస్తే అది ‘యమకాలంకారం’ అంటారు. సమన్వయం : పై వాక్యంలో మొదట ప్రయోగించిన ‘మానవా!’ అనేది ‘మనిషీ’ అనే అర్థంలో ప్రయోగించబడింది. రెండవసారి ప్రయోగించిన ‘మానవా’ అనేది ‘విడిచిపెట్టవా’ అనే అర్థంలో ప్రయోగించబడింది. ఇలాగ ఒకే పదం అర్థభేదంతో ప్రయోగించబడింది. కనుక అది యమకాలంకారం.
ఇ) తండ్రి ! హరి జేరుమనియెడి తండ్రి తండ్రి.
జవాబు:
దీనిలో లాటానుప్రాసాలంకారం కలదు.
వివరణ :
ఒకే పదం అర్థంలో భేదం లేకున్నా భావంలో తేడా ఉండేలా ప్రయోగిస్తే అది లాటానుప్రాసాలంకారం. సమన్వయం : పై వాక్యంలో ‘తండ్రి’ అనే పదం మూడు సార్లు ప్రయోగించబడింది. మూడు పదాలకు ‘నాన్న’ అనే అర్థం. కానీ, ‘తండ్రి తండ్రి’ అంటే ‘అటువంటి తండ్రి మాత్రమే నిజమైన తండ్రి’ అని భావం. అర్థంలో భేదం లేకపోయినా భావంలో భేదం ఉంది. కనుక అది లాటానుప్రాసాలంకారం.
5. కింది సమాస పదాలను వాటి విగ్రహవాక్యాలను పరిశీలించండి.
అధ్యలూ భావ సమాసం
సమాస పదం | విగ్రహవాక్యం | ప్రథమ పదం |
అ) ప్రతిదినము | దినము, దినము | (ప్రతి – అవ్యయం) |
ఆ) యథాశక్తి | శక్తిననుసరించి | (యథా – అవ్యయం) |
ఇ) ఆబాలగోపాలం | బాలుడి నుండి గోపాలుడి వరకు | (ఆబాల – అవ్యయం) |
ఈ) మధ్యాహ్నం | అహ్నం యొక్క మధ్యభాగం | (మధ్య – అవ్యయం) |
ఉ) అనువర్షం | వర్షముననుసరించి | (అను – అవ్యయం) |
(సూచన : కొందరు ‘మధ్యాహ్నం’ను ‘అహ్నము యొక్క మధ్యము’ అని విగ్రహవాక్యంతో ప్రథమా తత్పురుష సమాసంగా చెప్పారు.)
పైన పేర్కొన్న 5 సమాస పదాలలోనూ పూర్వపదాలైన ప్రతి, యథా, ఆబాల, మధ్య అనేవి అవ్యయాలు. లింగ, విభక్తి, వచనాలు లేనివి అవ్యయ పదాలు.
ఇటువంటి అవ్యయ భావంతో ఏర్పడిన సమాసాలు కనుక పైవి అవ్యయీభావ సమాసాలు.
6. కింది ఉదాహరణలకు విగ్రహవాక్యాలు రాయండి.
అ) అనుకూలం – కూలముననుసరించి – అవ్యయీభావ సమాసం
ఆ) యథామూలం – మూలమును అనుసరించి అవ్యయీభావ సమాసం
ఇ) ప్రతిమాసం – మాసం, మాసం అవ్యయీభావ సమాసం
అదనపు సమాచారము
సంధులు
అ) పాఠంలోని కొన్ని సంధులు
1) సహస్రాబ్దం = సహస్ర + అబ్దం – సవర్ణదీర్ఘ సంధి
2) శతాబ్దం = శత + అబ్దం – సవర్ణదీర్ఘ సంధి
3) సామాజికాభివృద్ధి = సామాజిక + అభివృద్ధి – సవర్ణదీర్ఘ సంధి
4) సాధికారం = స + అధికారం – సవర్ణదీర్ఘ సంధి
5) విద్యాధికులు = విద్యా + అధికులు – సవర్ణదీర్ఘ సంధి
6) సోదాహరణం = స + ఉదాహరణం – గుణసంధి
7) విజయోత్సవం = విజయ + ఉత్సవం – గుణసంధి
8) జీవనోపాధి = జీవన + ఉపాధి – గుణసంధి
9) సంస్కరణోద్యమం = సంస్కరణ + ఉద్యమం – గుణసంధి
10) శతాబ్దపు చరిత్ర = శతాబ్దము + చరిత్ర – పుంప్వాదేశ సంధి
11) మొదటి తరపు డాక్టరు = మొదటితరము + డాక్టరు – పుంప్వాదేశ సంధి
12) ప్రవాహపు వేగం = ప్రవాహము + వేగం – పుంప్వాదేశ సంధి
13) అద్దినట్లు = అద్దిన + అటు – అత్వ సంధి
14) ఏముంటుంది = ఏమి + ఉంటుంది – ఇత్వ సంధి
15) గురయ్యారు = గురి + అయ్యారు – ఇత్వ సంధి
16) బరువెక్కాయి = బరువు + ఎక్కాయి – ఉత్వసంధి
17) గుర్తుంచుకుంటాం = గుర్తు + ఉంచుకుంటాం – ఉత్వసంధి
18) మేమంతా = మేము + అంత – ఉత్వసంధి
19) జగన్నాథ జగత్ + నాథ – అనునాసిక సంధి
20) ఆశ్చర్యపడతాం = ఆశ్చర్యము + పడతాం – పడ్వాది సంధి
21) తాపత్రయపడిన + తాపత్రయము + పడిన – పడ్వాది సంధి
22) మొట్టమొదటగా = మొదటగా + మొదటగా – ఆమ్రేడితద్విరుక్త -టకారాదేశసంధి
సమాసాలు
సమాస పదం | విగ్రహవాక్యం | సమాసం పేరు |
1) ఆంధ్రదేశము | ‘ఆంధ్ర’ అనే పేరుగల దేశము | సంభావనా పూర్వపద కర్మధారయం |
2) స్థలకాలాలు | స్థలమును, కాలమును | ద్వంద్వ సమాసం |
3) విద్యాధికులు | విద్యచేత అధికులు | తృతీయా తత్పురుష సమాసం |
4) స్త్రీల శతాబ్దం | స్త్రీల యొక్క శతాబ్దం | షష్ఠీ తత్పురుష సమాసం |
5) శతాబ్దపు చరిత్ర | శతాబ్దము యొక్క చరిత్ర | షష్ఠీ తత్పురుష సమాసం |
6) జీవిత విధానం | జీవితము యొక్క విధానం | షష్ఠీ తత్పురుష సమాసం |
7) రథచక్రాలు | రథము యొక్క చక్రాలు | షష్ఠీ తత్పురుష సమాసం |
8) చరిత్ర నిర్మాత | చరిత్ర యొక్క నిర్మాత | షష్ఠీ తత్పురుష సమాసం |
9) భిన్నరంగాలు | భిన్నములైన రంగాలు | విశేషణ పూర్వపద కర్మధారయం |
10) కీలకస్థానాలు | కీలకమైన స్థానాలు | విశేషణ పూర్వపద కర్మధారయం |
11) ముఖ్యవివరాలు | ముఖ్యమైన వివరాలు | విశేషణ పూర్వపద కర్మధారయం |
12) సామాన్య స్త్రీలు | సామాన్యులైన స్త్రీలు | విశేషణ పూర్వపద కర్మధారయం |
13) ప్రతికూల పరిస్థితులు | ప్రతికూలములైన పరిస్థితులు | విశేషణ పూర్వపద కర్మధారయం |
14) కొత్తకలలు | కొత్తవైన కలలు | విశేషణ పూర్వపద కర్మధారయం |
15) ప్రతిరంగము | రంగము, రంగము | అవ్యయీభావ సమాసం |
పీఠిక రచయితుల పరిచయం
1) ఓల్గా :
ప్రముఖ రచయిత్రి. ఎన్నో పుస్తకాలకు సంపాదకత్వం నిర్వహించారు. ఈమె పలు పురస్కారాలను, అవార్డులను అందుకొన్నారు. వీరి ‘స్వేచ్ఛ’ నవల ప్రసిద్ధి పొందింది.
2) వసంత కన్నబిరాన్ :
ఈమె మానవ హక్కులు, స్త్రీ సమానత్వం కోసం కృషి చేస్తున్నారు. నేషనల్ అలయెన్స్ ఆఫ్ ఉమెన్, ఇండియన్ నేషనల్ సోషల్ యాక్షన్ ఫోరంలో పనిచేస్తున్నారు.
3) కల్పన కన్నబిరాన్ :
‘సెంటర్ ఫర్ నేషనల్ డెవలప్ మెంట్’ (హైదరాబాద్) సంచాలకులుగా పనిచేస్తున్నారు. జెండర్ స్టడీస్, క్రిమినల్ లో విస్తృత అధ్యయనం, పరిశోధనలు చేశారు.
కఠిన పదాలకు అర్థాలు
1వ పేరా
సహస్ర + అల్లం = వెయ్యి సంవత్సరాలు
పరామర్శ = చక్కని విచారణ
స్మరించుకోవడం = గుర్తు చేసుకోవడం
ఉత్సవం = పండుగ
2వ పేరా
రాణించిన = ఒప్పిన
3వ పేరా
సంఘర్షణ = రాపిడి
జగన్నాథ రథచక్రాలు = కాలగమనం (కాలం భగవత్స్వరూపం కనుక విష్ణువు రథచక్రాలు)
మూల్యం = వెల
గుండెలు బరువెక్కడం = చాలా బాధ కలగడం
ప్రేరణ = సిద్ధపరచడం
4వ పేరా
ప్రెసిడెన్సి = ఆధిపత్యము
అలోచించండి – చెప్పండి
ప్రశ్న 1.
కాలాన్ని పరామర్శించడం అంటే ఏమిటి?
జవాబు:
పరామర్శ అంటే చక్కని విచారణ అని అర్థం. కాలాన్ని పరామర్శించడం అంటే కాలాన్ని చక్కగా విచారించడం. కాలం నాలుగు రకాలు.
- భూతకాలం,
- భవిషత్ కాలం,
- వర్తమాన కాలం,
- తద్దర్శకాలం
నాలుగు కాలాలలో స్త్రీల పరిస్థితి గురించి కూలం కషంగా విచారించడం. దానికి కారణాలు, పరిష్కారాలు అన్వేషించడం.
ప్రశ్న 2.
గడిచిన శతాబ్దాన్ని స్త్రీల శతాబ్దంగా ఎలా చెప్పుకోవచ్చు?
జవాబు:
గడిచిన శతాబ్దంలో అంటే 20వ శతాబ్దంలో చాలా మంది స్త్రీలు అనేక రంగాలలో విజయాలు సాధించారు. రాజకీయ రంగంలో అనిబిసెంట్, మార్గరెట్ థాచర్, ఇందిరాగాంధీ, సిరిమావో భండారు నాయకే మొదలైన వారు. అలాగే విద్యా, వైద్య, సేవా, పరిశోధనా, క్రీడా రంగాలలోనే గాక అనేక రంగాలలో ఆణిముత్యాల వంటి స్త్రీలు ఉన్నారు. పురుషులతో సమానంగా అన్ని రంగాలలో స్త్రీలు పోటీపడి అభివృద్ధిని సాధించిన శతాబ్దం కనుక గడిచిన శతాబ్దాన్ని స్త్రీల శతాబ్దంగా చెప్పుకోవచ్చును.
ప్రశ్న 3.
చరిత్ర ఎలా రూపుదిద్దుకుంటుంది ?
జవాబు:
చరిత్ర చాలా రకాలుగా రూపుదిద్దుకొంటుంది. ఒక ప్రాంతానికి చెందిన మానవుల సాంస్కృతిక రూప కల్పనను, అభివృద్ధిని బట్టి సాంస్కృతిక చరిత్ర రూపుదిద్దుకొంటుంది. మానవుల భాషా వికాసాన్ని భాషాచరిత్ర అంటారు. అలాగే రాజకీయ మార్పులను బట్టి రాజకీయ చరిత్ర ఏర్పడుతుంది. అంటే సామాజికంగా జరిగిన దానిని చరిత్ర అంటారు.
ప్రశ్న 4.
మూల్యం చెల్లించడమంటే అర్థం ఏమిటి?
జవాబు:
మూల్యం అంటే విలువ అని అర్థం. మూల్యం చెల్లించడమంటే విలువ చెల్లించడమని సామాన్యార్థం. ఒక వస్తువును తీసుకొన్నప్పుడు దానికి సమానమైన విలువ గల డబ్బు గాని, సరుకు గాని చెల్లించాలి. అంటే మనం కూడా దానితో సమాన విలువ గలది కోల్పోవాలి. అలాగే ఏదైనా చెడు పని చేస్తే దానికి సమానమైన పరపతిని కోల్పోతాం. అదే మూల్యం చెల్లించడమంటే.
ప్రశ్న 5.
‘సామాన్యుల సాహసం అసామాన్యమనిపించింది’ అని రచయిత్రులు అనడానికి కారణాలు ఏమిటి ?
జవాబు:
సాధారణంగా సామాన్యమైన స్త్రీ తన కుటుంబంతో సర్దుకుపోతుంది. పూర్వకాలపు స్త్రీ తన కుటుంబం గురించి తప్పు, తన గురించి, తన సుఖం గురించి ఆలోచించలేదు. ఇది సామాన్య స్త్రీల స్వభావం. వారేదైనా అందుకు భిన్నంగా ప్రవర్తించినా, ఆలోచించినా అనేక చికాకులు వారికి కలిగేవి. వాస్తవ పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారిపోతాయి. అటువంటి ప్రతికూల పరిస్థితులతో తలపడుతూ, కొత్త జీవిత విధానాలను కనుగొనాలంటే ఎంత కష్టం ? అటువంటి పరీక్షలకు నిలబడి, ఎదురొడ్డి తమ కలలను సాకారం చేసుకొన్న పూర్వకాలపు సామాన్య స్త్రీల సాహసం రచయిత్రులకు అసామాన్యమనిపించింది.
5వ పేరా
నిష్ణాతులు కాలధర్మం విపులము క్లుప్తం నీరు కారడం
= పూర్తిగా తెలిసినవారు = మరణం = సవిస్తరము = సంక్షిప్తం = నిరుత్సాహపడటం
6వ వరా
ఉద్వేగం = కలత నొందుట
9వ పేరా
తాపత్రయం = బాధ (ఆధ్యాత్మికం, అధిభౌతికం, అధిదైవికం అను మూడూ తాపత్రయం)
10వ పేరా
పితృస్వామ్యం = తండ్రికి అధికారంగల వ్యవస్థ
కళ్ళకు కట్టింది = బాగా అర్థమైంది
11వ పేరా
అనువైన = తగిన
12వ పేరా
వెసులుబాటు = తీరుబడి
అడుగు పెట్టడం = ప్రారంభించడం
14వ పేరా
గ్లోసరీ = సాంకేతిక పదముల నిఘంటువు, పదకోశం
అమూల్యమైన = విలువైన
అలోచించండి – చెప్పండి
ప్రశ్న 1.
‘ముద్రవేయడం’ అంటే ఏమిటి?
జవాబు:
ముద్ర అంటే ఒకదాన్ని శాశ్వతంగా ఉండేలా చేయడం. మానవ స్వభావాలు అనేక రకాలు. కొందరికి, కొన్ని ఆశయాలు ఉంటాయి. ఆ ఆశయాలు సామాన్యులవైతే, అవి వారితోనే ఉంటాయి. వారి కుటుంబాల పైనే ఆ ఆశయాల ముద్రలు ఉంటాయి. అదే నాయకులవైతే, వాటి ముద్రలు సమాజంలో ఉంటాయి. ఏ రంగంలోనైనా, ఆ రంగంలో విశేష కృషి చేసినవారి ఆశయాలు, ఆలోచనలు కార్యరూపంలో శాశ్వతంగా ఉంటాయి. అంటే వారు ఆ రంగంలో తమదైన ముద్ర వేశారని అర్థం.
ప్రశ్న 2.
సంస్కరణోద్యమ రథచక్రాల కింద నలగడమంటే ఏమిటి?
జవాబు:
సంస్కరణోద్యమం అనేది రథం. అది వేగంగా నడవాలంటే మార్పులు అనే చక్రాలు కావాలి. ఈ మార్పులు జరిగేటపుడు కొందరికి బాధ కలుగుతుంది. ఒకప్పుడు సమాజానికి తప్పుగా కనిపించింది, కొన్నాళ్ళకు ఒప్పుగా కనబడుతుంది. కానీ, ఆ తప్పుగా కనబడిన రోజులలో ఎంతోమంది బాధపడతారు. ఉదాహరణకు ఒకప్పుడు స్త్రీ సినిమాలలో నటించడం తప్పు. కానీ నేడు కాదు. ఆనాటి సంస్కరణోద్యమాలు దానిని తప్పు పట్టడం వలన ఎంతోమంది స్త్రీలు వేదన చెందారు. ఎన్నో కుటుంబాలు తీవ్రమైన మానసిక వ్యధను అనుభవించాయి. అదే సంస్కరణోద్యమ రథచక్రాల కింద నలగడమంటే అర్థం.
ప్రశ్న 3.
“ప్రతివాళ్ళూ ప్రశ్నించారు చరిత్రను మార్చటానికి” అని స్త్రీల గురించి రచయిత్రులు ఎందుకన్నారు?
జవాబు:
కేవలం సంఘసంస్కరణ, చరిత్రను మార్చడం మగవారికే సాధ్యం అనుకొంటే పొరబాటు. అనేకమంది స్త్రీలు చరిత్రను మార్చటానికి ప్రశ్నించారని రచయిత్రుల ఉద్దేశం. కందుకూరి రాజ్యలక్ష్మిగారు స్త్రీ విద్య గురించి ఉద్యమించారు. బాల్య వివాహాలను ప్రతిఘటించారు. భర్త చనిపోయిన స్త్రీలకు మళ్ళీ వివాహాలు చేయాలని పోరాడారు. చేశారు. అలాగే ఎంతోమంది స్త్రీలు మార్పుకోసం పోరాడారు. తమ జీవితాలలో, సామాజిక జీవనరంగంలో కొత్త అర్థాలనూ, వెలుగులనూ సృష్టించాలని తాపత్రయపడ్డారు. కనుకనే “ప్రతివాళ్ళూ ప్రశ్నించారు చరిత్రను మార్చటానికి” అని స్త్రీల గురించి రచయిత్రులు అన్నారు.
ప్రశ్న 4.
కొత్త అర్థాలు, వెలుగుల సృష్టి ఎలా సాధ్యమవుతుంది?
జవాబు:
గతంలో సామాజికంగా స్త్రీల జీవితాలలో కొత్తదనం ఉండేది కాదు. అంటే స్త్రీలు కేవలం చాకిరీకి, పిల్లలను కనడానికే అని పూర్వకాలపు సమాజం భావించేది. కానీ విద్య, ఉద్యోగం మొదలైన వాటిలో అభివృద్ధిని సాధించి, స్త్రీలు తమ జీవితాలలో కొత్త అర్థాలను సాధించారు. అలా కొత్త అర్థాలు సాధించి తమ జీవితాలలో స్త్రీలు జ్ఞానజ్యోతులను వెలిగించుకున్నారు. ఆ జ్ఞానజ్యోతుల వెలుగులలో నూతన ఉత్తేజంతో జీవితాలను ఆనంద మయం చేసుకొంటున్నారు.
AP Board Textbook Solutions PDF for Class 10th Telugu
- AP Board Class 10 Textbook Solutions PDF
- AP Board Class 10 Telugu Textbook Solutions PDF
- AP Board Class 10 Telugu Chapter 1 మాతృభావన Textbook Solutions PDF
- AP Board Class 10 Telugu Chapter 2 అమరావతి Textbook Solutions PDF
- AP Board Class 10 Telugu Chapter 3 జానపదుని జాబు Textbook Solutions PDF
- AP Board Class 10 Telugu Chapter 4 వెన్నెల Textbook Solutions PDF
- AP Board Class 10 Telugu Chapter 5 ధన్యుడు Textbook Solutions PDF
- AP Board Class 10 Telugu Chapter 6 శతక మధురిమ Textbook Solutions PDF
- AP Board Class 10 Telugu Chapter 7 మా ప్రయత్నం Textbook Solutions PDF
- AP Board Class 10 Telugu Chapter 8 సముద్రలంఘనం Textbook Solutions PDF
- AP Board Class 10 Telugu Chapter 9 మాణిక్యవీణ Textbook Solutions PDF
- AP Board Class 10 Telugu Chapter 10 గోరంతదీపాలు Textbook Solutions PDF
- AP Board Class 10 Telugu Chapter 11 భిక్ష Textbook Solutions PDF
- AP Board Class 10 Telugu Chapter 12 చిత్రగ్రీవం Textbook Solutions PDF
- AP Board Class 10 Telugu ఉపవాచకం రామాయణం Textbook Solutions PDF
0 Comments:
Post a Comment